● దాదాపు రూ.20 లక్షలు నష్టం
సంతకవిటి: మండలంలోని బొద్దూరు గ్రామంలో దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో ఉండే అప్పమ్మ చెరువులో టన్నుల కొద్దీ చేపలు మృత్యువాత పడ్డాయి. చెరువులో ముళ్ల నాచు అధికంగా పేరుకు పోవడంతో చేపలు ఊపిరాడక మృత్యువాత పడ్డాయని దాదాపు రూ.20లక్షలు నష్టం వాటిల్లిందని సొసైటీ సభ్యులు వాపోతున్నారు. దాదాపు దశాబ్దాలనుంచి ఈ చెరువునే నమ్ముకుని శ్రీ గణేష స్వదేశీ పారిశ్రామిక సహకార సంఘ సభ్యులం బతుకుతున్నామని చేపలు మృత్యువాత పడడంతో వీధిన పడ్డామని సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘంలో దాదాపు 65 మంది సభ్యులున్నారు. చెరువులోని నీరు బయటకు వెళ్లకుండా ఓ రైతు అడ్డుపడడంతో చెరువులో నీరు అధికంగా ఉండడంతో నాచును చెరువునుంచి తీసేందుకు వీలు కాలేదు. ఎండలకు నీరు తగ్గడంతో చేపలు తిరుగాడేందుకు వీలుకాక ఊపిరాడక చనిపోయాయాని గ్రామానికి చెందిన సభ్యుడు దువ్వారపు శ్రీను వాపోయాడు.


