కేజీబీవీల్లో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత ప్రభుత్వ సంస్కరణలతోనే నేడు ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సత్తా చాటిన పేదింటి విద్యార్థినులు బాలికల భవితకు కేజీబీవీలు భరోసా
గ్రూపులు ఇలా..
టీచర్ కావాలన్నదే లక్ష్యం
తాను వ్యవసాయ కుటుంబంలో పుట్టి బూసాయవలస కేజీబీవీ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీలో చేరాను. ఇక్కడ ఇంటర్లో 947 మార్కులు సాధించడం చాలా గర్వంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మామయ్య ప్రభుత్వ విద్యలో మార్పులు చేసి మంచి సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన కేజీబీవీలో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టకుంటే ప్రైవేటు కాలేజీల్లో డబ్బులు ఖర్చుపెట్టి నాలాంటి వారు చదవాల్సి వచ్చేది. అంత స్తోమత మాకు లేదు. జగన్ మామయ్య సంస్కరణలు నా చదువుకు ఎంతగానో ఉపకరించాయి. వెటర్నరీ డాక్టర్ కావడమే నా లక్ష్యం.
–ఎస్,షర్మిల, సెకండియర్ టాపర్ విద్యార్థిని
రామభద్రపురం:
పేదరికం చదువుకు అడ్డుకాకూడదనే ఓ సంకల్పంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది. పేదింటి పిల్లలు ఉన్నత చదువులకు దూరం కాకూడదు.. ప్రతి ఇంట్లో ఇంజినీరు, డాక్టర్ ఉండాలన్న లక్ష్యంతో 2018లో జిల్లాలో ఒక్క కేజీబీవీలో మాత్రమే ఇంట ర్ విద్య ఉండగా.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని కేజీబీవీల్లో పాఠశాల స్థాయి నుంచి ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. ఇప్పుడు 26 కేజీబీవీలను కార్పొరేట్ కళాశాలలకు దీటుగా తీర్చిదిద్దారు. నాడు – నేడు, అమ్మ ఒడి, వసతి, విద్యాదీవెన తదితర పథకాలు అమలు చేశారు. ఫలితంగా నేడు కేజీబీవీల్లో విద్యార్థినులు ఇంటర్లో సత్ఫలితాలు సాధించారు. ఇదంతా గత ప్రభుత్వం చలువేనని తల్లిదండ్రులు, విద్యార్థినులు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
జిల్లాలో రామభద్రపురం, బాడంగి, బొండపల్లి, గంట్యాడ, ఎల్.కోట, నెల్లిమర్ల, వేపాడ, గుర్ల, వంగర మండలాల్లో ఉన్న మొత్తం తొమ్మిది కేజీబీవీలు ఇంటర్ ఫస్టియర్లో వంద శాతం ఫలితాలు సాధించాయి. అలాగే రామభద్రపురం, బాడంగి, బొండపల్లి, గంట్యాడ, గుర్ల, జామి, కొత్తవలస, పూసపాటిరేగ, రేగిడి, తెర్లాం మండలాల్లో ఉన్న మొత్తం పది కేజీబీవీలు ఇంటర్ సెకండియర్లో వంద శాతం ఫలితాలు సాధించాయి. రామభద్రపురం, బాడంగి, బొండపల్లి, గంట్యాడ, గుర్ల మండలాలో ఉన్న కేజీబీవీలలో మొత్తం ప్రధమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు వంద శాతం ఉత్తీర్ణులయ్యారు.
గత వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో విద్యా రంగంలో చేసిన సంస్కరణలే నేడు ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలకు దోహదం చేశాయని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. పేద బాలికలకు పైసా ఖర్చు లేకుండా వసతితో కూడిన నాణ్యమైన విద్య బోధనను ప్రభుత్వం నుంచి ఉచితంగా లభిస్తుండడంతో కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో మరింత మంది చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అప్పట్లో 26 కేజీబీవీలో ఒకొక్క జూనియర్ కళాశాలలో ఒక్కో గ్రూపు మాత్రమే ఏర్పాటు చేసింది. వీటిలో గ్రూపునకు 40 మంది చొప్పున ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తంగా 1040 మంది విద్యార్థినులు చదివేందుకు అవకాశం ఉంది. అయితే కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో కేజీబీవీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థినులు చదివేందుకు అవకాశం కల్పించారు. దీంతో ప్రవేశాలు పెరిగాయి.
బాడంగి, చీపురుపల్లి, గజపతినగరం, గరివిడి, మెంటాడ, కొత్తవలస, ఎల్.కోట, నెల్లిమర్ల కళాశాలలో ఎంపీసీ గ్రూపు నిర్వహిస్తున్నారు. రామభద్రపురం, భోగాపురం, బొండపల్లి, పూసపాటిరేగ, రాజాం, తెర్లాం, వంగర, విజయనగరం, గంట్యాడలో గల కళాశాలల్లో బైపీసీ గ్రూపులు ఉన్నాయి. సంతకవిటిలో సీఈసీ, ఆర్.ఆమదాలవలస, వేపాడ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్(సీఎస్ఈ), బొబ్బిలి, డెంకాడ, జామి కళాశాలల్లో ఎంపీహెచ్డబ్ల్యూ, గుర్ల కళాశాలలో ఫిజియోథెరిఫీ, దత్తిరేజేరు కేజీబీవీ కళాశాలలో ప్రైమరీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ గ్రూపులు నిర్వహిస్తున్నారు.
టీచర్ కావాలన్నదే నా లక్ష్యం. బూసాయవలస కేజీబీవీ జూనియర్ కాలేజీ లో ఇంటర్మీడియట్ బైపీసీలో 927 మార్కులు సాధించాను. సెకండ్ టాపర్గా నిలిచాను. గత ప్రభుత్వ చలువతో పాటు అధ్యాపకుల బోధనతో ఇది సాధ్యమైంది.
– ఎన్.మోహిని, కేజీబీవీ విద్యార్థిని


