విజయనగరం టౌన్: ఆంధ్రాయూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని విశాఖలోని ఏయూ కన్వెన్షెన్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సోషల్ వర్క్ విభాగంలో పూర్వ పరిశోధక విద్యార్థిగా ఉన్న జిల్లాకు చెందిన పెంకి చిట్టిబాబుకు ఘనసత్కారం జరిగింది. ఇటీవల ఐక్యరాజ్యసమితి దోహాలో నిర్వహించిన రెండవ సోషల్ సమ్మిట్లో పాల్గొనడమే కాకుండా, బాలల హక్కులు, దళిత ఆదివాసీ హక్కులపై సుబ్రహ్మణ్యం జా తీయ అవార్డు పొందిన చిట్టిబాబుకు యూనివర్సిటీ రెక్టార్ పి.కింగ్ చేతుల మీదుగా అభినందించారు. సోషల్ వర్క్ విభాగాధిపతి ఆచార్య ఎస్.హరినాథ్, ఆచార్య ఆర్.స్వామిదాస్, విశ్రాంత ప్రొఫెసర్లు టి.శోభ, పి. అర్జున్, కె.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి రూరల్: పారాది వద్ద వేగావతి నదిలో అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్న 5 ఇసుక ట్రాక్టర్లను ఆర్ఐ రామకుమార్ ఆదివారం పట్టుకున్నారు. కొద్ది రోజులుగా వేగావతి నదిలో ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు జరగుతున్నాయని స్థానికుల నుంచి అందిన సమాచారం మేరకు తహసీల్దార్ ఎం.శ్రీను ఆదేశాలతో తమ సిబ్బందితో దాడులు చేయగా అలజంగి వద్ద రెండు,పారాది వద్ద మూడు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుబడ్డాయని ఆర్ఐ తెలిపారు.పట్టుకున్న ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయానికి తరలించామని, సోమవారం ఆర్డీఓ ఆదేశాలతో జరిమానా విధిస్తామని తెలిపారు.
విద్యార్థులు నైపుణ్యాలు
పెంపొందించుకోవాలి
నెల్లిమర్ల రూరల్: విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సెంచూరియన్ విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షుడు డీఎన్ రావు సూచించారు. ఈ మేరకు నెల్లిమర్ల మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన కౌశల్ సాథీ కార్యక్రమంలో వీసీతో పాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతలో నైపుణ్యాలు ఉంటే ఉపాధి అవకాశాలు సులభంగా లభిస్తాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం విద్యార్హతలతో ఉద్యోగాలు పొందడం కష్టమవుతోందని, నైపుణ్యాల ఆధారిత ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయన్నారు. అందువల్ల యువత తమకు ఇష్టమైన రంగంలో ప్రావీణ్యం సంపాదించుకోవాలని సూచించారు. వీసీ ప్రశాంత కుమార్ మాట్లాడుతూ రెగ్యులర్ కోర్సులతో పాటు నైపుణ్య కోర్సులకు విశ్వవిద్యాలయం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అనంతరం పలువురు విద్యార్ధులకు కౌశల్ సాథీ ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ పల్లవి, అధ్యాపకులు పాల్గొన్నారు.
అలరించిన చిన్నారుల
నృత్య ప్రదర్శన
నెల్లిమర్ల: స్థానిక శ్రీరామకృష్ణ ధ్యాన మందిరం వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం చిన్నారులు చేసిన భరతనాట్య ప్రదర్శన అలరించింది. అంతకుముందు భీమునిపట్నానికి చెందిన ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీరామకృష్ణానంద చేసిన ప్రవచనాలు ఆలోచింపజేశాయి. కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు టి.జగన్నాథరాజు, బి.వంశీపావని తదితరులు పాల్గొన్నారు.


