● కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్రెడ్డి
సీతానగరం: గ్రామాల్లో పొదుపు సంఘాల సభ్యులు చేస్తున్న 2026 జనగణన పక్కాగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్రెడ్డి అన్నారు. ఈ మేరకు సీతానగరం మండలంలోని సూరంపేట పంచా యతీ, మరిపివలస రామమందిరంలో వెలుగు ఏపీఏ కె.పద్మ పర్యవేక్షణలో పొదుపు సంఘాల సభ్యులు చేస్తున్న వ్యక్తిగత జన గణన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదుపుసంఘాల సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న జనగణన పక్కాగా ఉన్నప్పుడే ప్రణాళికలు సక్రమంగా ఉంటాయని తెలియజేశారు. ఎన్యూమరే్షన్ చేయడం వల్ల ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు, అభివృద్ధి పనులు మంజూరు చేయడానికి, సంక్షేమ పథకాల మంజూరు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని జనగణన చేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధశాఖల అధికార సిబ్బంది, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.


