విజయనగరం అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం అవగాహన ర్యాలీకి శ్రీకారం చట్లారు.
ర్యాలీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిచిన్నారి విద్యను పొందడం అత్యంత ముఖ్యమని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సదుపాయాలు, నాణ్యమైన బోధన, మెరుగైన మౌలిక వసతులు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయని పేర్కొన్నారు. ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో నమోదు శాతం పెంచడం, డ్రాప్ అవుట్లను తగ్గించడం ప్రధాన లక్ష్యమన్నారు. ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతిఇంటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


