విజయనగరం గంటస్తంభం: ఎంపీ లాడ్స్(పార్టమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం) నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదిక గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఎంపీ లాడ్స్ పనుల ప్రగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎంపీ నిధులతో మంజూరైన పనులు ఇంకా పెండింగ్లో ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు తక్షణ ప్రయోజనం చేకూరేలా నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో విజయనగరం ఎంపీ నుంచి 68, విశాఖ ఎంపీ నుంచి 4, ముగ్గురు రాజ్యసభ సభ్యుల నుంచి 8 పనులు మంజూరయ్యాయని వెల్లడించారు.
జాప్యం వద్దు..పారదర్శకత ముఖ్యం
పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, విద్యుత్, మున్సిపాలిటీలు, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల వారీగా పనుల స్థితిగతులను ఆరా తీశారు. సివిల్,విద్యుత్ పనుల్లో జాప్యం ఉండకూడదని, భూ వివాదాలు ఉంటే తహసీల్దార్లతో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు. నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత ఉండాలని, పనులు పూర్తయిన వెంటనే వివరాలను పోర్టల్లో ఆప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీపీఓ పి.బాలాజీ, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం


