● ఏజెన్సీలో విస్తారంగా సాగు
గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీ ప్రాంత రైతులు జీడిమామిడి సాగుతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. గిరిజనులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ‘సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ’ (ఐటీడీఏ– పార్వతీపురం) 1980 – 90 సంవత్సరాల మధ్య చేపట్టిన బృహత్తర ప్రణాళికే జీడితోటల పెంపకం. ఇందుకు బీజం వేసింది మొదటిగా గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో కాగా తర్వాత రోజుల్లో జియ్యమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, సాలూరు, తదితర సబ్ప్లాన్ ఏరియా అంతటా విస్తరించారు. అయితే రైతుల కష్టపడే తత్వం, అధికారుల చిత్తశుద్ధితో అనతికాలంలోనే మంచి ఫలితాలు రాబట్టారు. ఈ ప్రక్రియలో అప్పటి ప్రాజెక్ట్ అధికారులైన ఆర్పీ సిసోడియా, బి.జగన్నాఽథం, తదితరుల నిరంతర కృషి ప్రసంశనీయం. ఇదే తరహాలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో గల గిరిశిఖర గ్రామాలైన పొల్ల, దొనుబాయి, పెదరాం మొదలుకొని ఏజెన్సీ ప్రాంతమంతటా జీడితోటల పెంపకం విరివిగా చేపట్టి గిరిజనుల ఆర్థిక పరిపుష్టికి బాసటగా నిలిచారు అక్కడి ప్రాజెక్ట్ అధికారులు. గిరిజన రైతులు జీడి తోటల పెంపకంపై మరింత ఆశక్తి కనబరచడంతో పార్వతీపురం – సీతంపేట ఏజెన్సీ ప్రాంతమంతటా జీడిమామిడి తోటలు విస్తరించాయి. ఈ ఏడాది మంచి పూత రావడంతో గిరిజన రైతులు జీమిమామిడిపై ఆశలు పెంచుకున్నారు.
తాడికొండలో పూతతో నిండిన జీడిమామిడి చెట్టు


