
జిల్లా నేలల్లో నత్రజని లోపం
● పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం
● సేంద్రియ కర్బన లోపం కూడా ఎక్కువే..
● నాలుగు మండలాల్లో జింక్ లోపం
● 2024–25లో 21,175 మట్టి
నమూనా పరీక్షలు
● ఈ ఏడాది లక్ష్యం 28,392
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని నేలల్లో నత్రజని లోపం అధికంగా ఉంది. భూసార పరీక్ష కేంద్రం అధికారులు చేపట్టిన మట్టి నమూనా పరీక్షల్లో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. నత్రజనితో పాటు సేంద్రియ కర్బనం లోపం కూడా ఉన్నట్టు తేలింది. కొన్ని మండలాల్లో జింక్, ఐరన్ లోపం ఉంది. నత్రజని లోపం పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, పంట ఎదుగుదల లోపించడంతో పాటు పంట దిగుబడి గణనీయంగా తగ్గుతోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. నత్రజని పంటకు ఆక్సిజన్ లాంటిదని పేర్కొన్నారు. నత్రజని, సేంద్రియ కర్బన పోషకాల భర్తీకి పశువుల గెత్తం, వర్మీ కంపోస్టును పొలాల్లో వేసుకోవాలన్నారు. లేదంటే జీలుగ, కట్టెజనుము, పిల్లిపెసర వంటి పచ్చి రొట్ట ఎరువులు సాగుచేసి భూమిలో కలియదున్నాలన్నారు.
లక్ష్యం 28,392 భూసార పరీక్షలు
2024–25 సంవత్సరానికి సంబంధించి భూసార పరీక్ష కేంద్రం అధికారులు 21,205 మట్టి నమూనా పరీక్షలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా 21,175 పరీక్షలు చేశారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి 28,392 పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం 15 సెం.మీ లోతులో వి–షేప్ ఆకారంలో మట్టి నమూనాలు సేకరించనున్నారు.
నాలుగు మండలాల్లోని నేలల్లో జింక్ లోపం
జిల్లాలోని చీపురుపల్లి, రాజాం, గజపతినగరం, బొబ్బిలిలో జింక్ లోపం ఉంది. జింక్ లోపం నివారణకు దమ్ములో ఎకరానికి 20 కేజీల జింక్ సల్ఫేట్ వేయాలి.
● జిల్లాలోని చీపురుపల్లి, బొబ్బిలి మండలాల్లోని భూముల్లో ఐరన్ లోపం కూడా ఉంది. దీని నివారణకోసం అన్నభేది 2.5 గ్రాములు, నిమ్మ ఉప్పు 5 గ్రాముల చొప్పన లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
పోషక లోపాలను భర్తీచేయాలి
భూమిలో పోషక లోపాలను భర్తీ చేయాలి. మట్టి నమూనా పరీక్షల ఫలితాలను రైతులకు తెలియజేస్తున్నాం. ఈ ఏడాది 28,392 మట్టి నమూనా పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జిల్లాలో నత్రజని, సేంద్రియ కర్బన లోపం అధికంగా ఉంది. దీనిని నివారించుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు.
– భానులత, ఏడీ, భూసార పరీక్ష కేంద్రం

జిల్లా నేలల్లో నత్రజని లోపం

జిల్లా నేలల్లో నత్రజని లోపం