
మందుల దుకాణం
విజయనగరం ఫోర్ట్: తెర్లాం మండలంలో ఓ వ్యక్తి లైసెన్స్ లేకుండా మందులు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఔషధ నియంత్రణశాఖ (డ్రగ్ కంట్రోల్) అధికారులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి షాపు నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.
● విజయనగరం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఒడిశా నుంచి రహస్యంగా మందులు తెచ్చి లైసెన్స్ లేకుండా ఇక్కడ విక్రయిస్తున్నట్టు ఔషధ నియంత్రణశాఖ అధికారులకు సమాచారం రావడంతో అధికారులు విచారణ చేస్తున్నారు.
● మందుల వ్యాపారం లాభదాయకంగా ఉండడంతో కొంత మంది ధనార్జన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. దీని వల్ల ప్రభుత్వ రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. జిల్లాలో మందుల దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వాటిలో కొన్ని లైసెన్స్ తీసుకుని పెడుతుంటే మరి కొంతమంది ఎటువంటి లైసెన్స్ లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. దొరికితే దొంగ లేదంటే దొర అన్న చందాన వ్యవహరిస్తున్నారు. లైసెన్స్ తీసుకుని షాపు పెట్టి మందులు విక్రయిస్తే ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి వస్తుంది. అదే లైసెన్స్ తీసుకోకపోతే ఎటువంటి ఫీజులు, పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మందులు విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా పొందవచ్చననే భావనతో కొంతమంది వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. లైసెన్స్ తీసుకున్న మందుల దుకాణాలు 800 వరకు జిల్లాలో ఉంటాయి.
తెలియని మందుల నాణ్యత
లైసెన్స్ లేకుండా విక్రయించే మందులు నాణ్యమైనవో కాదో తెలియని పరిస్థితి. లైసెన్స్ ఉన్న మందుల దుకాణాలైతే ఔషధ నియంత్రణ అధికారులు శాంపిల్స్ సేకరించి వాటి నాణ్యతను నిర్ధారించడానికి విజయవాడ ల్యాబొరేటరీకి పంపిస్తారు. లైసెన్స్ లేకుండా విక్రయంచే వారి దగ్గర మందుల శాంపిల్స్ సేకరించడం కుదరదు. నాణ్యత లేని మందులు వేసుకోవడం వల్ల రోగుల ఆరోగ్య పై ప్రభావం చూపి ప్రాణం మీదికి వస్తుంది.
ప్రభుత్వ ఆదాయానికి గండి
ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి మందుల విక్రయం
లైసెన్స్ లేకుండా విక్రయం కూడదు
లైసెన్స్ లేకుండా మందులు విక్రయించకూడదు. అలా మందులు విక్రయించిన వారిపై ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. జిల్లాలో ఎక్కడైనా లైసెన్స్ లేకుండా మందులు విక్రయించినా, మందులు నిల్వ చేసినా ఫిర్యాదు చేయాలి. నాణ్యత లేని మందులు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – రజిత,
అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ శాఖ
