రియల్ఎస్టేట్ రోడ్లు
పంచాయతీ రస్తాలో ..
● ఆక్రమించించిన స్థలం విలువ రూ.3 కోట్ల పైమాటే ● కన్నెత్తి చూడని అధికారులు ● గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
విజయనగరం రూరల్: అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తే అధికారులు ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనప్పటికీ కిమ్మనకుండా ఉన్నారు. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాల్సింది పోయి, అధికార పార్టీ నేత ఇచ్చే ఆమ్యామ్యాలకు తలొగ్గి అప్పనంగా రియల్ ఎస్టేట్కు ధారాదత్తం చేసేశారు. చంద్రబాబు సర్కార్ ఏర్పాటైన ఏడాదిన్నర కాలంలో అధికార పార్టీ చోటా మోటా నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ఎప్పుడెప్పుడు వాటిని కబ్జా చేసేద్దాం అన్న ఆలోచనతో యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు. ముందుగా రియల్ ఎస్టేట్ పేరిట వెంచర్లు ఏర్పాటు చేసుకుని వాటి పక్కనే ఉన్న ప్రభుత్వ భూములు రస్తా భూములను కబ్జా చేసి వెంచర్లలో కలిపేసుకుని అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కూటమి నేతల పరమై వారికి కోట్లాది రూపాయల డబ్బు వర్షం కురిపిస్తున్నాయి.
మండలంలోని సారిక రెవెన్యూ పరిధి గొల్లలపేట గ్రామపంచాయతీ సర్వే నంబర్ 329/14లో 60 సెంట్ల పంచాయతీకి చెందిన 60 సెంట్ల రస్తా స్థలం కబ్జాకు గురైనా అధికారులు గుర్తించకపోవడం విశేషం. గొల్లలపేట గ్రామం నుంచి కొన్నేళ్ల క్రితం రస్తా భూమిలో కొంతమేర పంచాయతీ స్థలంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. మరో వంద మీటర్ల వరకు రస్తా (సుమారు 60 సెంట్లు) స్థలం మిగిలిఉంది. అయితే అదే రస్తా స్థలం ఉన్నచోట టీడీపీ నేత భాగస్వామిగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వారి స్థలంలో ప్లాట్లు వేసి అభివృద్ధి చేస్తోంది. అయితే పంచాయతీ రస్తా స్థలం ఆ రియల్ ఎస్టేట్ స్థలం మధ్యలో ఉండడంతో రస్తా స్థలాన్ని ఆక్రమించేసి దానిని రోడ్డుగా అభివృద్ధి చేశారు. అంతేకాకుండా పంచాయతీ నిర్మించిన సిమెంట్ రోడ్డును తవ్వేసి తవ్వేసి అడ్డంగా ప్రహరీ నిర్మాణాన్ని రియల్ ఎస్టేట్ సంస్థ చేపట్టింది. సుమారు 60 సెంట్ల స్థలం విలువ రూ. 3 కోట్లకు పై మాటేనని పలువురు పేర్కొంటున్నారు.
ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు
కోట్ల రూపాయల విలువైన భూమిని కాపాడాల్సిన రెవెన్యూ పంచాయతీ అధికారులు ఒత్తిళ్లకు లొంగి పంచాయతీ భూమిని అప్పనంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి అధికారులు లక్షల రూపాయలు దండుకుని విలువైన ప్రభుత్వ స్థలాన్ని వారికి వదిలేసినట్లు ఆవేదనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గ్రామస్తులు పలుమార్లు తహసీల్దార్ కార్యాలయంలోను, కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లోను ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి తహసీల్దార్ సదరు స్థలాన్ని పరిశీలించి అది పంచాయతీ రస్తా స్థలమని, 188 సెక్షన్ ప్రకారం దానిని కాపాడవలసిన బాధ్యత పంచాయతీదేనని రాతపూర్వకంగా ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు ఇన్చార్జ్ తహసీల్దార్ దాసరి గాంధీ తెలిపారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి తేజను వివరణ కోరగా నిర్మాణం జరిగిన రోడ్డు కొంత వరకే పంచాయతీ స్థలం ఉందని మిగతాది రియల్ ఎస్టేట్ వారిదే అని తెలిసిందన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమించిన రస్తా స్థలం విషయం తనకు తెలియదని దానిపై గతంలో వచ్చిన ఫిర్యాదులకు పరిష్కారం లభించినట్లు తనకు తెలిసిందని అంతకుమించి ఏమీ తెలియదని తెలిపారు.
రియల్ఎస్టేట్ రోడ్లు
రియల్ఎస్టేట్ రోడ్లు


