ఆరిలోవ: తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ఆరిలోవ ప్రాంతవాసులు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. జీవీఎంసీ 13వ వార్డు పరిధి శ్రీకాంత్నగర్లోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో సకాలంలో కుళాయి నీరు సరఫరా కావడం లేదని నిరసన వ్యక్తం చేశారు. చాలీచాలని నీటితో రోజువారీ అవసరాలు తీర్చుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టిన స్థానికులకు వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు తెలిపారు. కాలనీలోని అవసరాలకు సరిపడేలా ప్రతిరోజూ కుళాయి నీటిని సరఫరా చేయాలని, నీటి సరఫరాలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులను డిమాండ్ చేశారు.
కొండవాలులోనూ అరకొర నీరే..
జీవీఎంసీ 12వ వార్డు పరిధి సుందరయ్యకాలనీ కొండవాలు ప్రాంతంలోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా, మెట్ల పక్కన ఏర్పాటు చేసిన సింథటిక్ ట్యాంకుల్లో నీటిని నింపుతున్నారు. అయితే సుమారు మూడు నెలలుగా ట్యాంకులు అరకొరగానే నిండుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో కొండవాలులో నివసించే కుటుంబాలకు నీరు సరిపోవడం లేదని వాపోతున్నారు. నీటి అవసరాలు తీర్చేందుకు సింథటిక్ ట్యాంకులను ప్రతిరోజూ పూర్తిస్థాయిలో నింపాలని, నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.


