జాతీయ మత్స్యకార సంఘం అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్
మహారాణిపేట: మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని జాతీయ మత్స్యకార సంఘం అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. పబ్లిక్ లైబ్రరీలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తూ అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడం దురదృష్టకరమని, మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామ న్నారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడాన్ని తాము ఎంతమాత్రం వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు.అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ లేని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూడా అదే తరహా తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం వెనుక స్పష్టమైన రాజకీయ ఉద్దేశం ఉందని జానకిరామ్ విమర్శించారు. డాక్టర్ అప్పలరాజు ఒక వైద్యుడిగా వేలాది మందికి సేవలందించారని, మత్స్యశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీదిరి అప్పలరాజును రాజకీయంగా అణచివేయడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని జానకిరామ్ ఆరోపించారు. మత్స్యకార నాయకుడు తెడ్డు శంకర్ మాట్లాడుతూ ప్రమాదంలో మరణించిన వ్యక్తి భార్య ద్రౌపది ఇచ్చిన ఫిర్యాదులో కూడా అది ప్రమాదవశాత్తు జరిగిందేనని పేర్కొన్నారని, అలాంటప్పుడు అప్పలరాజును అరెస్టు చేయడం కక్షసాధింపేనని స్పష్టం చేశారు.న్యాయవాది తెడ్డు తాతారావు , కాసారపు వెంకటేశ్వరరావు, దూడ పోలయ్య, బడే ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు.


