పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు పిలుపు
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్ సీపీ నిరసన గళం విప్పింది. మెగా డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ జంక్షన్ వరకు వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పాదయాత్రగా నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టర్ను కలిసి డీఎస్సీ అక్రమాలపై వినతిపత్రం అందజేయనున్నారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు హాజరుకానున్నారని పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉరుకూటి చందు తెలిపారు. ప్రభుత్వం ‘దగా డీఎస్సీ’తో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటోందని ఆయన మండిపడ్డారు. ర్యాలీలో డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులు, నిరుద్యోగులతో పాటు పార్టీ శ్రేణులంతా హాజరుకావాలని ఉరుకూటి చందు పిలుపునిచ్చారు.


