విశాఖ నగరం అంటేనే బీచ్.. కానీ అదే బీచ్ ఇప్పుడు పర్యాటకుల పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా నొవోటెల్ హోటల్ ఎదురుగా ఉన్న తీర ప్రాంతం అడుగు తీసి అడుగు వేయాలంటే వణుకు పుట్టించేలా ఉంది. గతంలో సముద్రపు పోటుకు ధ్వంసమైన రక్షణ గోడను అధికారులు గాలికొదిలేశారు. ఆ శిథిలాలు ఇప్పుడు పర్యాటకుల పాలిట మృత్యుకుహరాలుగా మారాయి. తీరానికి చేరుకోవాలంటే భారీ కాంక్రీట్ దిమ్మలు, జారుడుగా ఉన్న మట్టి దిబ్బల మధ్య నుంచే వెళ్లాలి. చిన్న పిల్లలు, వృద్ధులు ఈ దారిలో వెళ్లడం ప్రాణాలతో చెలగాటమే. సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. చీకటి పడ్డాక అక్కడ పరిస్థితి మరింత దారుణం. కాలు జారినా, పట్టు తప్పినా నేరుగా రాళ్ల మధ్య పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అధికారులు వెంటనే స్పందించి ఈ రక్షణ గోడకు మరమ్మతులు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.


