మద్దిలపాలెం: ఏయూ స్థలాల అభివృద్ధికి ‘ఇంటిగ్రేటెడ్ కార్గో టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐసీటీపీఎల్)’ సంస్థ ముందుకొచ్చింది. మూడెకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిని శుభ్రపరిచే చర్యలు చేపట్టింది. మొక్కల రక్షణ కోసం ఆ ప్రాంతం చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. మియావాకి విధానాన్ని అనుసరించి వివిధ రకాల మొక్కలను నాటి, స్థిరమైన హరిత వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ఏయూ వీసీ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్, రెక్టార్లు, డీన్లు, ఆచార్యులు హాజరై ఐసీటీపీఎల్ చొరవను అభినందించారు. ఐసీటీపీఎల్ డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జితిన్ సింగ్, ఓఎస్ఎల్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ జేకే నాయక్ పాల్గొని మాట్లాడారు. వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు చురుగ్గా పాల్గొని మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేక నీటి సరఫరా వ్యవస్థను కూడా ఐసీటీపీఎల్ ఏర్పాటు చేసింది. ‘వన్ మిలియన్ ప్లాంటేషన్ డ్రైవ్’లో భాగంగా విశాఖ పోర్టు సంస్థ కూడా గ్రీన్ బెల్ట్ అభివృద్ధి కోసం మొక్కలను అందజేసిందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వీసీటీపీఎల్ టెర్మినల్ హెడ్ సుదీప్ బెనర్జీ, వైస్ ప్రెసిడెంట్ డి.నరేష్ కుమార్, బిజినెస్ హెడ్ కళ్యాణ్ చక్రవర్తి, ఐసీటీపీఎల్ డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జితిన్ సింగ్ కంపానీ, వైస్ ప్రెసిడెంట్ జితేంద్ర కుమార్ నాయక్, డాక్టర్ ప్రకాష్, ఏయూ ఆచార్యులు, విదేశీ విద్యార్థులు పాల్గొన్నారు.


