6న భారత్ – దక్షిణాఫ్రికా వన్డే
ఏర్పాట్లపై కలెక్టర్ ఉన్నతస్థాయి సమీక్ష
విశాఖ స్పోర్ట్స్: వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో వచ్చే నెల 6న భారత్–దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ నేతృత్వంలో స్టేడియంలో జరిగిన ఈ సమావేశంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మైదానం నిర్వహణ, తాగునీరు, పారిశుధ్యం వంటి కీలక అంశాలపై అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. మ్యాచ్ కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రవేశ ద్వారాల వద్ద రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పార్కింగ్ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సమర్థవంతమైన కమ్యూనికేషన్ కోసం కేంద్రీకృత పబ్లిక్ అడ్రెసింగ్ వ్యవస్థ ఏర్పాటుకు అధికారులను నియమించామన్నారు. ఇరుజట్ల భద్రత కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ.. జీరో వేస్ట్ మేనేజ్మెంట్ లక్ష్యంతో మ్యాచ్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా తగినంత మంది సిబ్బందిని నియ మిస్తామన్నారు. ప్రేక్షకులకు సరిపడా తాగునీటిని అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే క్రికెటర్లు ప్రయాణించే మార్గాల్లోనూ, ఇతర ముఖ్య ప్రాంతాల్లోనూ సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. డీసీపీలు ిసీహెచ్ మణికంఠ, మేరీ ప్రశాంతి, ఏసీఏ ప్రతినిధులు, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


