
వీఆర్ఎస్పై అయోమయం
● ముందుకురాని స్టీల్ప్లాంట్ ఉద్యోగులు ● ఇప్పటివరకు కేవలం 850 దరఖాస్తులు
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ యాజమాన్యం రెండో విడత ప్రకటించిన వలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్) దరఖాస్తు విషయంలో ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. మూడో బ్లాస్ట్ఫర్నేస్ ప్రారంభించినందున ప్లాంట్ పరిస్థితులు బాగుపడే అవకాశం ఉందని ఉద్యోగులు ఒకవైపు ఆశావాహంగా ఆలోచిస్తుండగా.. రానున్న రోజుల్లో మరింత పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందన్న భయం మరోవైపు వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ వీఆర్ఎస్ పట్ల ఉద్యోగులు ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ, ఆర్థిక సదుపాయాల కోత వంటి కారణాల వల్ల ఈ ఏడాది మార్చి నెలలో వచ్చిన మొదటి వీఆర్ఎస్కు స్పందన లభించింది. అప్పట్లో కూడా వీఆర్ఎస్ పరిహారం, పీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ శాలరీ మొత్తం ఇస్తారా... లేదా అనే సందేహాలతో 1,613 మంది మాత్రమే దరఖాస్తు చేస్తున్నారు. యాజమాన్యం వారికి సకాలంలో అన్ని చెల్లించడంతో అప్పుడు దరఖాస్తు చేయనివారు తప్పు చేశామన్న భావన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇటీవల కాలంలో పెరిగిన పని ఒత్తిడి, పూర్తి జీతాలు ఇప్పటికీ చెల్లించకపోవడం వంటి కారణాల వల్ల ఈసారి వీఆర్ఎస్ వస్తే కనీసం మూడు వేల మంది దరఖాస్తు చేస్తారని అందరూ ఊహించారు. అయితే అంత స్పందన లేకపోవడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. గత బడ్జెట్లో మిగిలిన సొమ్ము మేరకు మాత్రమే ఈసారి వీఆర్ఎస్ ఇస్తారని తద్వారా 500 మందికి మించరని ఊహాగానాలు వినిపించడం, ఇప్పటికే సిబ్బంది బాగా తగ్గిన నేపథ్యంలో చాలా విభాగాల్లో విభాగాధిపతులు వచ్చిన దరఖాస్తులను అంగీకరించేది లేదని చెబుతుండటంతో చాలా మంది ఆశావాహులు ఢీలా పడి దరఖాస్తు చేయనట్టు తెలుస్తుంది. అందువల్లే ఇప్పటివరకు సుమారు 850 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలుస్తుంది. జూలై 15 వరకు గడువు ఉన్నందున చివరలో ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని మరో వాదన వినిపిస్తున్నది. ఏమైనా గడువు ముగిస్తే కాని వీఆర్ఎస్పై స్పష్టత వచ్చే అవకాశం లేదు.