
ఆటస్థలం పేరుతో ఆక్రమణ?
తగరపువలస: ఆనందపురం మండలం గిడిజాల పంచాయతీలోని దిబ్బడిపాలెం సర్వే నంబర్ 258లో పెద్ద కొండను ఆనుకుని ఉన్న సుమారు 2 ఎకరాలకు పైగా స్థలం ఆటస్థలం పేరుతో కబ్జా చేసేందుకు స్కెచ్ రెడీ అయింది. దీని విలువ రూ.25 కోట్ల పైమాటే. ఈ ప్రాంత యువకుల క్రీడా అవసరాల పేరుతో కబ్జాల్లో ఘనుడైన కూటమి ప్రభుత్వానికి చెందిన ఒక వ్యక్తి దీని వెనుక ఉన్నట్టు టీడీపీ నాయకులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ కొండ భాగాన్ని తవ్వి వేలాది లారీల గ్రావెల్ను తరలించి లక్షల రూపాయలు వెనకేసుకున్నాడు. గతంలో కూడా పంచాయతీలో సర్వే నంబర్ 310/5లో 2 ఎకరాలు, 311/14లో 2.04 ఎకరాలు కలిపి రూ.40 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రిసార్ట్స్ పేరుతో నడుపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై రెండు నెలల కిందట ఆనందపురం మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతో.. మరో విలువైన స్థలాన్ని ఆక్రమించేందుకు జోరుగా పావులు కదుపుతున్నాడు. దీని పై ఎవరూ నోరు మెదపకుండా ఇప్పటి నుంచే నోట్ల కట్టలతో ప్రభావితం చేస్తున్నాడు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిని తీసుకువచ్చి రాజమార్గం ద్వారా ఈ స్థలాన్ని కొట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు టీడీపీ నాయకులే చెబుతున్నారు.
గతంలో ఈ స్థలం పీహెచ్సీకి కేటాయింపు
2014–19 టీడీపీ హయాంలో ఈ స్థలాన్ని అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్సీ) కేటాయించారు. నెలరోజుల కిందట ఎమ్మెల్యే గంటా వద్దకు కబ్జాల్లో ఆరితేరిన ఈ వ్యక్తి 50 మంది స్థానిక యువకులను తీసుకువెళ్లి చదును చేసిన 2 ఎకరాల స్థలాన్ని ఆటస్థలానికి ఇవ్వాలని కోరగా ఆయన నిరాకరించారు. మండలంలో టీడీపీ నాయకులంతా నిన్ను వ్యతిరేకిస్తున్నారని ముఖం మీదే కుండబద్దలు కొట్టడంతో ఆ వ్యక్తి విసురుగా వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆనందపురం తహసీల్దార్ లేకపోవడంతో ఇదే అదనుగా మళ్లీ ఈ స్థలంలో పాగా వేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. గత ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో ఇక్కడి రిసార్ట్లో పేకాట క్లబ్ నిర్వహించకుండా ఆనందపురం పోలీ సులు గట్టిగా కాపలా కాశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పోలీసులు ఈ కబ్జా రాయుడితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. సీపీ శంఖబ్రత బాగ్చి బదిలీపై వెళ్లిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన అధికారితో మాట్లాడుకుని తిరిగి పేకాట క్లబ్ నిర్వహించాలని ప్రణాళిక రచిస్తున్నాడు. ప్రస్తుతం తహసీల్దార్ లేనందున ఇదే అదనుగా 2 ఎకరాల స్థలాన్ని క్రీడా మైదానం పేరుతో చేజిక్కించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు.
రూ.25 కోట్ల విలువైన భూమి కబ్జాకు యత్నం

ఆటస్థలం పేరుతో ఆక్రమణ?