
ఉపాధ్యాయులకు సర్దు‘పోటు’
● పెరిగిన విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తి ● మిగిలిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ● ప్రాథమిక పాఠశాలలకు సర్దుబాటు ● మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల చేరికలు
ఆరిలోవ : జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల ఉపాధ్యాయ పోస్టులకు భారీగా కోత పడింది. కూటమి ప్రభుత్వం విద్యా విధానంలో చేపట్టిన మార్పులు, ముఖ్యంగా విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తిని మార్చడంతో విద్యాబోధనకు, విద్యార్థుల భవిష్యత్తుకు తీవ్రంగా నష్టం కలిగిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నిష్పత్తి పెంపుతో పోస్టులకు కోత
ఇటీవల ప్రభుత్వం విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తిని 40:1 నుంచి 49:1కి పెంచింది. అంటే ఒక తరగతి గదిలో విద్యార్థుల సంఖ్యను 40 నుంచి 49కి పెంచారు. ఈ నిర్ణయం వల్ల ఉన్నత పాఠశాలల్లో అవసరమైన స్కూల్ అసిస్టెంట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనికి తోడు ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు మందకొడిగా ఉన్నాయి. ఒక వైపు విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా, మరోవైపు నిష్పత్తిని పెంచడంతో ఉపాధ్యాయ పోస్టులు మిగులుగా(సర్ ప్లస్) తేలాయి. ఈ పరిణామాలు డీఎస్సీ–2025లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇదే పరిస్థితి ప్రాథమిక పాఠశాలల్లోనూ నెలకొంది. అక్కడ కూడా విద్యార్థుల సంఖ్య తగ్గడం, నిష్పత్తి పెరగడంతో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల(ఎస్జీటీ) పోస్టుల అవసరం కూడా గతంతో పోలిస్తే తగ్గిపోయింది.
వందకు పైగా పోస్టులు మిగులు
విశాఖ జిల్లా పరిధిలోని ఏడు మండలాల్లో 56 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్లో కొత్త నిష్పత్తి కారణంగా సుమారు 100కి పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగులుగా తేలాయి. ఈ మిగులు ఉపాధ్యాయులను ఏ ఖాళీల్లో సర్దుబాటు చేయాలో తెలియక జిల్లా విద్యాశాఖాధికారులకు కత్తిమీద సాములా మారింది. చివరికి ఉన్నత పాఠశాలల్లో మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్లను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా నియమించాల్సి వచ్చింది. దీని వల్ల ఇప్పటివరకు 6 నుంచి 10వ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులు బోధించిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు.. ఇప్పుడు 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు అక్షరాలు నేర్పించాల్సిన విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.