
మళ్లీ సముద్రంలో సందడే సందడి
● వైఎస్సార్సీపీ హయాంలో ప్రారంభమైన కార్డేలియా క్రూయిజ్ యాత్ర ● విశాఖ నుంచి జూలై 2, 9, 16 తేదీల్లో ప్రారంభం ● చైన్నె–విశాఖపట్నం–పుదుచ్చేరి–చైన్నె మధ్య సర్వీసు ● ఇప్పటికే ఆన్లైన్లో ప్రారంభమైన టికెట్ల విక్రయాలు
విశాఖ సిటీ : సాగర విహార ప్రపంచానికి విశాఖ మరోసారి స్వాగతం పలుకుతోంది. సముద్ర జలాల్లో తేలియాడే అద్భుత సౌధం మళ్లీ నగరానికి వచ్చేస్తోంది. అలలపై ఆహ్లాదకర ప్రయాణాన్ని అందించనుంది. విలాసవంతమైన సముద్ర విహార నౌకను చైన్నె–విశాఖపట్నం–పుదుచ్చేరి–చైన్నెల మధ్య నడపడానికి కార్డేలియా క్రూయిజ్ సంస్థ మళ్లీ ముందుకొచ్చింది. విశాఖ నుంచి జూలై 2, 9, 16 తేదీల్లో మూడు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. 2022 జూన్లో ఇదే సంస్థ విశాఖ నుంచి క్రూయిజ్ నౌకను నడిపింది. ఈ నౌకలో విహరించేందుకు విశాఖ ప్రజలే కాకుండా చుట్టు పక్కల రాష్ట్రాల పర్యాటకులు పోటీ పడ్డారు. దీంతో 85 శాతం మేర ఆక్యుపెన్సీతో ఆ ఏడాది సెప్టెంబర్ వరకు నడిచింది. ఈసారి విశాఖ పోర్టులో కొత్తగా నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి ఈ విహార నౌక రాకపోకలు సాగించనుంది. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ల విక్రయాలను సైతం ప్రారంభించింది.
విహార యాత్ర ఆరంభం ఇలా..
సెవెన్ స్టార్ హోటల్కు మించి విలాసవంతమైన నౌకలో విహారం.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా 24 గంటలు వినోదం.. విభిన్న వంటకాలతో రుచికరమైన ఆహారం.. ఆరోగ్యానికి జిమ్, ఫిట్నెస్ సెంటర్ల సౌకర్యం.. స్విమ్మింగ్ పూల్స్లో జలకాలాటలు.. రాక్ కై ్లంబింగ్ విన్యాసాలు.. ఆహ్లాదపరిచే డ్యాన్స్ షోలు.. అబ్బురపరిచే మ్యాజిక్ ప్రదర్శనలు.. సినిమా థియేటర్లు.. ఇలా ఎటువంటి ఒత్తిడి లేకుండా.. సమయం తెలియకుండా 24/7 ఎంజాయ్ చేసే లగ్జరీ విహార యాత్ర విశాఖ నుంచి ప్రారంభమవుతోంది. ఈ క్రూయిజ్ నౌక జూన్ 30న చైన్నెలో బయలుదేరి జూలై 2వ తేదీ ఉదయం విశాఖకు వస్తుంది. అదే రోజు సాయంత్రం ఇక్కడ నుంచి బయలుదేరి 4వ తేదీన పుదుచ్చేరికి చేరుకుంటుంది. మళ్లీ అదే రోజు అక్కడి నుంచి బయలుదేరి 5వ తేదీన చైన్నె వెళుతుంది. దీంతో ఒక ట్రిప్పు పూర్తవుతుంది. ఆ తరువాత జూలై 7న చైన్నెలో మరో ట్రిప్పు ప్రారంభమై.. 9వ తేదీన విశాఖకు చేరుకుని.. మళ్లీ ఇక్కడి నుంచి బయలుదేరి 12వ తేదీన చైన్నెలో ముగుస్తుంది. మూడో ట్రిప్పు జూలై 14న చైన్నెలో మొదలై 16వ తేదీకి విశాఖకు చేరుకుంది. తిరిగి అదే రోజు ఇక్కడి నుంచి ప్రారంభమై 19వ తేదీన చైన్నెలో ముగుస్తుంది.