
సీనియర్ జర్నలిస్ట్ దివాకర్ మృతికి సంతాపం
మహారాణిపేట: సీనియర్ జర్నలిస్టు పైల దివాకర్ కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో గాయత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దివాకర్ పార్థివదేహాన్ని అక్కయ్యపాలెంలోని ఆయన నివాసంలో సందర్శనార్థం ఉంచారు. సోమవారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పని చేసిన దివాకర్.. వైజాగ్ జర్నలిస్టు ఫోరం కార్యవర్గ సభ్యుడిగానూ సేవలందించారు. 2010 నుంచి వైఎస్సార్ సీపీ పీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతి తీరని లోటని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.