అట్టహాసం.. ముణ్నాళ్ల ముచ్చటే.! | - | Sakshi
Sakshi News home page

అట్టహాసం.. ముణ్నాళ్ల ముచ్చటే.!

Jun 30 2025 3:44 AM | Updated on Jun 30 2025 3:44 AM

అట్టహ

అట్టహాసం.. ముణ్నాళ్ల ముచ్చటే.!

● దుర్వినియోగమైన ప్రజాధనం ● బయటపడ్డ నాణ్యత డొల్లతనం ● బీచ్‌రోడ్డులో మొక్కుబడిగా సాగిన ‘యోగాంధ్ర’ పనులు

ఏయూక్యాంపస్‌: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘యోగాంధ్ర’ పనులు ముణాళ్ల ముచ్చటగా మిగిలాయి. ప్రజాధనంతో చేపట్టిన సుందరీకరణ పనుల్లోని నాణ్యతలోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో మొక్కుబడిగా పనులు చేసి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకోగా.. ప్రజాధనం నీళ్లపాలైన తీరు నగరవాసులను విస్మయానికి గురి చేస్తోంది.

బట్టబయలైన నాణ్యత లోపం

నెల రోజుల పాటు హడావుడి చేసి.. బీచ్‌ రోడ్డుకు వేసిన రంగులు కేవలం వారం రోజుల్లోనే వెలిసిపోవడం పనుల నాణ్యతకు అద్దం పడుతోంది. ప్రధానమంత్రి పాల్గొన్న ఆర్‌.కె.బీచ్‌ వేదిక వద్ద నుంచి వీఎంఆర్డీఏ స్మార్ట్‌ సిటీ పార్క్‌ వరకు ఫుట్‌పాత్‌లకు వేసిన తెలుపు, నలుపు రంగులు పూర్తిగా వెలిసిపోతున్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనంతో చేపట్టిన పనులు కనీసం నెల రోజులైనా నిలవకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పనులు జరుగుతున్నప్పుడే నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. అయినప్పటికీ అధికారులు ఒత్తిడిలో వాటిని పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు నాసిరకం పనులతో సరిపెట్టారు. కార్యక్రమం జరిగి వారం రోజులకే రంగులు వెలిసిపోవడం, ప్రజాధనం ఎలా దుర్వినియోగమైందో చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.

మొక్కల సంరక్షణ ఎక్కడ?

రంగుల విషయంలోనే కాక మొక్కల పెంపకంలోనూ ఇదే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. యోగా విలేజ్‌, జీవీఎంసీ స్విమ్మింగ్‌ పూల్‌, ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌ వంటి కీలక ప్రాంతాల్లో నాటిన మొక్కలు నీళ్లు లేక ఎండిపోయి చనిపోతున్నాయి. పాండురంగాపురం వద్ద ఏర్పాటు చేసిన వర్టికల్‌ గార్డెన్‌లోని మొక్కల్లో చాలా వరకు జీవం కోల్పోయాయి. కొన్ని మొక్కలను కనీసం మట్టిలో నాటకుండా కుండీలతో సహా వదిలేయడం గమనార్హం.

ప్రజాధనం దుర్వినియోగంపై ప్రజల ఆగ్రహం

ప్రతిష్టాత్మక కార్యక్రమం పేరుతో కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత తక్కువ కాలంలోనే పనులు పాడైపోతుంటే, ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి జరిగిన పనుల నాణ్యతపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాలని, బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని, బిల్లుల చెల్లింపును నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే, ప్రజాధనాన్ని దోచుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఒక మార్గంగా మారిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అట్టహాసం.. ముణ్నాళ్ల ముచ్చటే.!1
1/3

అట్టహాసం.. ముణ్నాళ్ల ముచ్చటే.!

అట్టహాసం.. ముణ్నాళ్ల ముచ్చటే.!2
2/3

అట్టహాసం.. ముణ్నాళ్ల ముచ్చటే.!

అట్టహాసం.. ముణ్నాళ్ల ముచ్చటే.!3
3/3

అట్టహాసం.. ముణ్నాళ్ల ముచ్చటే.!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement