
హార్బర్లో చేపల జాతర
మహారాణిపేట: విశాఖ సాగర తీరంలో వేట మళ్లీ ఊపందుకుంది. 61 రోజుల వేట నిషేధాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని సముద్రంలోకి అడుగుపెట్టిన మత్స్యకారుల వలలకు ఇప్పుడు సిరుల పంట పడుతోంది. భారీ ఎత్తున పట్టుబడిన మత్స్య సంపదతో ఆదివారం విశాఖ ఫిషింగ్ హార్బర్ కోలాహలంగా మారింది. ఈ సీజన్ ఆరంభం మత్స్యకారులకు శుభసూచకంగా మారింది. ముఖ్యంగా రొయ్యలు భారీ పరిమాణంలో లభించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాణ్యమైన రొయ్యలతో పాటు పీతలు, వంజరాలు, ట్యూనా, చందువాలు, మెత్తని పారలు వంటి రకరకాల చేపలు కూడా పుష్కలంగా దొరికాయి. వేట నిషేధం సత్ఫలితాలనిచ్చిందని, సముద్రంలో మత్స్య సంపద పెరిగిందని మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం కావడంతో ఫిషింగ్ హార్బర్ కొనుగోలుదారులు, వ్యాపారులతో కిటకిటలాడింది. పడవలు ఒడ్డుకు చేరగా.. తాజా చేపల కోసం జనం ఎగబడ్డారు. ఈ చేపలను స్థానిక మార్కెట్లలో విక్రయించడంతో పాటు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు మత్స్యకారులు ఏర్పాట్లు చేశారు.

హార్బర్లో చేపల జాతర