ఒంట్లో బాలేదు.. కొంతసేపు ఉండి వస్తాను | - | Sakshi
Sakshi News home page

ఒంట్లో బాలేదు.. కొంతసేపు ఉండి వస్తాను

Jun 30 2025 11:44 AM | Updated on Jun 30 2025 12:23 PM

.

.

ఆరిలోవ: ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ లాడ్జిలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్నేహితులతో కలిసి కొంత సమయం గడిపిన తర్వాత అతను మరణించినట్లు తెలుస్తోంది. ఎస్‌ఐ రాందాస్‌ తెలిపిన వివరాలివి.. కాకినాడకు చెందిన కుక్కల లోకనాథ్‌(34) ఎంవీపీ కాలనీలోని సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసులో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య కూడా సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసులో కాంట్రాక్టు పద్ధతిలో అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేటలో ఉద్యోగం చేస్తోంది. అతని అత్తగారిల్లు నగరంలోని దసపల్లా ప్రాంతంలో ఉంది.

 వారాంతంలో వారు నగరంలోని అత్తవారింటికి వస్తుంటారు. సోషల్‌ వెల్ఫేర్‌ విభాగంలో జరుగుతున్న బదిలీలకు సంబంధించి లోకనాథ్‌ మరో నలుగురు స్నేహితులతో కలిసి శనివారం నగరానికి వచ్చాడు. హనుమంతవాక వద్ద పారామౌంట్‌ లాడ్జిలో వారంతా రూమ్‌ తీసుకున్నారు. ఆదివారం అందరూ కలిసి డ్యూటీకి వెళ్లాల్సి ఉండగా.. లోకనాథ్‌ ‘ఒంట్లో బాలేదు.. కొంతసేపు ఉండి వస్తాను’అని మిగిలిన స్నేహితులకు చెప్పాడు. దీంతో మిగిలిన నలుగురు స్నేహితులు లాడ్జి నుంచి బయలుదేరి డ్యూటీకి వెళ్లిపోయారు. కొంతసేపటికి లోకనాథ్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చి ‘కడుపులో మంటగా ఉంది’అని ఓ షాపులో గ్యాస్ట్రిక్‌కు సంబంధించిన ప్యాకెట్‌ కొన్నాడు. తిరిగి రూమ్‌కి వెళ్లిపోయాడు.

 ‘కడుపు నొప్పిగా ఉంది. కొంత సేపటి తర్వాత వస్తాను’ అని ఆఫీసు హెడ్‌కు ఫోన్‌లో చెప్పాడు. ఎంతసేపటికీ లోకనాథ్‌ డ్యూటీకి రాకపోవడంతో తోటి ఉద్యోగులు మళ్లీ ఫోన్‌ చేసినా స్పందన లేదు. దీంతో లాడ్జి నిర్వాహకులకు ఫోన్‌ చేసి చెప్పగా.. స్పందించిన సిబ్బంది రూమ్‌ తలుపులు తెరిచి చూసేసరికి మంచంపై విగతజీవిగా పడి ఉన్నాడు. లాడ్జి నిర్వాహకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మల్లేశ్వరరావు, ఎస్‌ఐ రాందాస్‌, సిబ్బంది అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్‌ఐ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement