
వైభవం.. వరదపాయస సేవ
సింహాచలం: సింహగిరిపై వైకుంఠవాసుడి సన్నిధిలో ఆదివారం వరదపాయసం సేవ విశేషంగా నిర్వహించారు. దేశంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఏటా సింహగిరిపై ఉన్న వైకుంఠవాసుడి మెట్టపై కొలువుదీరిన వైకుఠవాసుడి సన్నిధిలో పాయసం వండి, సమీపంలో ఉన్న పొర్లు బండపై నుంచి జారవిడవడం ఆచారంగా వస్తోంది. దీనినే వరదపాయసం సేవగా పేర్కొంటారు. అప్పన్న ఆలయ అర్చకులు ఉదయం 8 నుంచి పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడై కొలువుదీరిన వైకుంఠవాసుడి సన్నిధిలో విష్వక్సేణపూజ, పుణ్యాహవచనం, పంచకలశ ఆవాహనం, పంచకలశ స్నపనం, విశేష ఆరాధన ఘనంగా జరిపారు. విరాట్పర్వ పారాయణం చేశారు. అనంతరం అక్కడే వండిన పాయసాన్ని స్వామికి నివేదించి, సమీపంలో ఉన్న పొర్లు బండపై జారవిడిచారు. భక్తులు పొర్లు బండపై నుంచి జారే పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధాన అర్చకుడు కరి సీతారామాచార్యులు, అర్చకులు, పారాయణదారులు, వేదపండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం ఈవో వి.త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.
వైకుంఠవాసుడికి విశేషంగా అభిషేకాలు
విరాట్పర్వ పారాయణం,
పాయసం నివేదన