
‘ప్రధాని’ కార్యక్రమానికి పైసల్లేవ్.!
● ఆర్భాటమే గానీ..నిధులివ్వని కూటమి సర్కార్ ● 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ● ప్రధాని మోదీ, ఇతర ప్రముఖుల రాక ● ఈ వేడుకల నిర్వహణకు రూ.75 కోట్ల్ల అంచనా ● యోగా భారమంతా స్థానిక సంస్థలకే!
మహారాణిపేట: జిల్లాలో ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(యోగాంధ్ర) అంగరంగ వైభవంగా, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లక్ష్యంగా నిర్వహించాలని నిర్ణయించినా.. అందుకు అవసరమైన నిధుల కోసం అధికార యంత్రాంగం తీవ్రంగా కుస్తీ పడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మరో ఐదు రోజులే సమయం ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని తెలుస్తోంది.
రూ. 75 కోట్ల అంచనా.. సాయం సున్నా!
ఆర్.కె.బీచ్ నుంచి భీమిలి వరకు ఏకంగా ఐదు లక్షల మందితో యోగాసనాలు చేయించి గిన్నిస్ రికార్డు నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కార్యక్రమ నిర్వహణ మీద సమీక్షలు, ప్రాంతాల పర్యటనలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సుమారు రూ.75 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇంతటి భారీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత అందలేన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఒక లేఖ పంపినప్పటికీ, ఆ నిధులు మాత్రం ఇప్పటికీ విడుదల కాలేదని సమాచారం. దీంతో మొత్తం ఆర్థిక భారం జీవీఎంసీ, వీఎంఆర్డీలపై పడుతోంది. బీచ్రోడ్డులో 500 కంపార్ట్మెంట్ల నిర్మాణం వంటి పనులను ఈ సంస్థలు తమ నిధుల నుంచే చేపడుతున్నాయి. మొత్తానికి యోగా భారమంతా స్థానిక సంస్థలపైనే పడుతోంది..
కేంద్రం ఇచ్చినా.. రాష్ట్రం చేయూతనివ్వదే..
యోగాలో పాల్గొనే వారికి కేంద్ర ప్రభుత్వం మ్యాట్లు, టీ షర్ట్స్ ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ముందు అనుకున్న ప్రకారం రెండు లక్షల మ్యాట్లు, టీ–షర్టులు పంపింది. ప్రస్తుతం వాటి డీకోడింగ్ జరుగుతోంది. అయితే పాల్గొనే వారి సంఖ్యను ఐదు లక్షలకు పెంచడంతో మరో మూడు లక్షల మ్యాట్లు, టీ–షర్టులు అదనంగా అవసరమయ్యాయి. ఒక్కో మ్యాట్ ఖరీదు రూ.340 చొప్పున ఈ మూడు లక్షల మ్యాట్ల కొనుగోలుకే సుమారు రూ.10 కోట్లు ఖర్చవుతుంది. దీనికి తోడు కార్యక్రమంలో పాల్గొనే ఐదు లక్షల మందికి అందించే స్నాక్స్ ప్యాకెట్(కేక్, బిస్కెట్, అరటిపండు, వాటర్ బాటిల్, గ్లూకోజ్ ప్యాకెట్) కోసం మరో రూ.5 కోట్లు అవసరం. ఈ అదనపు భారాన్ని ఎవరు మోయాలన్న దానిపై స్పష్టత కొరవడింది. వీటికి అదనంగా ప్రధాని, వీఐపీలు, వీవీఐపీల బస, ప్రయాణ ఏర్పాట్లు, వేదికల నిర్మాణం వంటి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సమయం దగ్గర పడుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో, ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలా అని జిల్లా యంత్రాంగం తలలు పట్టుకుంటోంది.