పూడూరు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కె.సుధాకర్లాల్ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక కేజీబీవీలో కంటి స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు కంటి సంబంధ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్యారెట్, బొప్పాయి, ఆకుకూరలు, పండ్లు తరచుగా తీసుకోవాలన్నారు. బషీరాబాద్, కొడంగల్, కుల్కచర్ల పాఠశాలల్లో ఇప్పటికే కంటి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయ్యాయని చెప్పారు. 254 విద్యార్థినులకు గాను 35 మందికి కంటి అద్దాలు, ఒకరికి మెల్లకన్ను, మరొకరికి ఉన్నత స్థాయి సేవలు అవసరమని నిర్ధారించినట్లు తెలిపారు. విద్యార్థుల్లో దృష్టిలోప నివారణకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్ర కారం ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దేవిక, ఆర్బీఎస్కే ప్రిన్సిపాల్ ఫాతి మా, ఆర్బీఎస్కే వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్లాల్


