నవాబుపేట: ఉన్న ఒక్క టీచర్ వస్తేనే చదువు.. లేకపోతే సెలవు. ఇదీ నాగిరెడ్డిపల్లి పాఠశాల పరిస్థితి. ఉపాధ్యాయులు సెలవు పెడితే కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై సర్పంచ్ శేఖర్, పలువురు స్థానికులు ఎంఈఓ అబ్దుల్ రహమాన్కు ఫోన్ చేసినా స్పందించలేదని మండిపడ్డారు. మంగళవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు బడి తలుపులు తెరవకపోవడంతో రెండు గంటల పాటు టీచర్ కోసం ఎదురు చూశారు. ఆతర్వాత చేసేదేమీ లేక ఇళ్లకు వెళ్లిపోయారు. ఈవిషయమై ఎంఈఓను వివరణ కోరగా పాఠశాలలో ఒకే టీచర్ పనిచేస్తున్నారని, అనారోగ్య సమస్య కారణంగా సెలవు పెట్టారని తెలిపారు. తాను కూడా సెలవులో ఉండటంతో మరో టీచర్ను నియమించడంలో జాప్యం జరిగిందని, మరోసారి కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.


