పూడూరు: వరుస వర్షాలతో గ్రామీణ ప్రాంతాల దారులన్నీ ఛిద్రమయ్యాయి. గోతులు ఏర్పడి, నీరు నిలిచి ప్రమాదాలకు నిలయంగా మారాయి. వాహనం నడపాలంటే వెన్నులో వణుకుపుడుతోందని చోదకులు వాపోతున్నారు. ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు. పూడూరు మండల పరిధి అంగడిచిట్టంపల్లి– లాల్పహాడ్ రోడ్డు పూర్తిగా రూపం కోల్పోయింది. అంగడిచిట్టంపల్లి, మీర్జాపూర్, పూడూరు, కంకల్, చన్గోముల్ ప్రధాన రోడ్డు అధ్వానంగా మారాయి. ఇందులో లాల్పహాడ్– కంకల్ రహదారి విస్తరణ పనులను సదరు కాంట్రాక్టర్ మధ్యలో వదిలేయడంతో ఆ మార్గం మరింత దయనీయంగా మారింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రోడ్డు కుంటను తలపిస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, రహదారుల మరమ్మతు, నిర్మాణ పనులు నాణ్యతగా త్వరంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.


