మిత్రుల కలయిక కోసం సంక్షేమ సంఘం
హుడాకాంప్లెక్స్: ‘అల్లాయే దిగివచ్చి.. ఏమి కావాలంటే..? మిద్దెలొద్దు.. మేడలొద్దు.. పెద్దలెక్కే గద్దెలొద్దంటా.. ఉన్ననాడు.. లేనినాడు ఒకే ప్రాణమై నిలిచే.. ఒక్క దోస్తే చాలంటా.. స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. స్నేహమేరానాకున్నది.. స్నేహమే నాపెన్నిధి’ అంటూ సినీనటుడు కై కాల, ఎన్టీఆర్ ఏళ్ల క్రితం ఆలపించిన ఆ పాట చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఇదే స్ఫూర్తితో రంగారెడ్డి జిల్లా హస్తినాపురానికి చెందిన రాందేశ్పాండే 2008లో స్నేహితుల కలయిక కోసం ‘స్నేహమేవ జయతే’ సంక్షేమ సంఘాన్ని స్థాపించారు. కేవలం నలుగురు మిత్రులతో మొదలైన ఈ స్నేహ ప్రస్థానం.. ప్రస్తుతం మూడు వందల మందికిపైగా విస్తరించింది. ‘స్నేహాన్ని కన్న మిన్న లోకాన లేదురా’ అంటూ దోస్తీ గొప్పతనాన్ని నేటి తరానికి వివరిస్తుంది.
అనేక సంక్షేమ కార్యక్రమాలు
ఆగస్టు 2న స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వీరంతా ఒకే వేదికపై కలుసుకుని, ఆర్థికంగా వెనుకబడిన స్నేహితులకు అండగా నిలబడటంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేస్తుంటారు. ఆ తర్వాత వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తుంటారు. వీధుల్లో ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చే కార్యక్రమం సహా స్నేహం విలువను చాటి చెబుతుంటారు. పర్యావరణ పరిరక్షణ, నీటిపొదుపు, పాలిథిన్ బ్యాగుల నిషేధం, అనాథ శరణాలయాల్లో అన్నదానం జాతి నేతల గొప్పతనంపై కరపత్రాల పంపిణీ, రాఖీ రోజున ఫ్రెండ్షిప్ బాండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతూ నవతరం స్నేహితులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
నలుగురితో మొదలై.. నేడు 300 మందికి విస్తరణ
స్నేహం విలువను చాటి చెబుతున్న స్నేహమేవ జయతే సంస్థ సభ్యులు


