కుల్కచర్ల: పాంబండ రామలింగేశ్వర దేవస్థానంలో ప్రత్యేకపూజలు కొనసాగుతున్నాయి. ప్రతీ పౌర్ణమికి నిర్వహించే రుద్రహోమం ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేకపూజలు చేసి, హోమం నిర్వహించారు. అన్నప్రసాద వితరణ చేశారు. ప్రతీ పౌర్ణమికి కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి, సర్పంచ్ మడుగు శ్రీనివాస్, ఉప సర్పంచ్ గోవర్దన్ రెడ్డి తెలిపారు. పూజారి దశరథం, పాండు ఉన్నారు.
కుల్కచర్ల: ఆర్ఎస్ఎస్ ప్రారంబిక వర్గ కార్యక్రమాన్ని రేపటి నుంచి నిర్వహించనున్నామని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఖండ కార్యవాహ కంకంటి ఆంజనేయులు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడారు. జాతీయ భావాలు గల యువతకు మూడురోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. రేపు మండల కేంద్రంలోని వివేకానంద కళాశాలలో కార్యక్రమం కొనసాగనుందని తెలిపారు. కుల్కచర్ల, చౌడాపూర్, దోమ మండలాలకు చెంది, 55 సంవత్సరాల లోపు వారందరూ అర్హులేనని, మరిన్ని వివరాలకు 99127 66638, 9502028991 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
దుద్యాల్: మండల పరిధి పోలేపల్లి ఎల్లమ్మ ఆయలం ఎండోమెంట్ అధికారిగా శాంతి కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన ఈఓ రాజేందర్రెడ్డి.. అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో రిమాండ్లో ఉన్నారు.
దీక్షను జయప్రదం చేయండి:
టీజేఎంయూ
పరిగి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం నగరంలోని ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న దీక్షను జయప్రదం చేయాలని టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మంత్ ముదిరాజ్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. విలీనానికి కొందరు కుట్రదారులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. దీంతో యూనియన్ ఎన్నికలు నిర్వహించిన తర్వాతే విలీనం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. నేటి నిరసన కార్యక్రమానికి ఆర్టీసీ కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
కొత్తూరు: పార్టీలు, రాజకీయాలకతీతంగా సిద్ధాపూర్లో డంప్యార్డు ఏర్పాటును అడ్డుకోవడానికి సిద్ధంగా ఉండాలని డంప్యార్డు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు ఎమ్మె సత్యనారాయణ కోరారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన పలువురు నాయకులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో కలిసి డంప్యార్డు ఏర్పాటుకు జీహెచ్ఎంసీకి కేటాయించిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డంప్యార్డు ఏర్పాటును నిరసిస్తూ సిద్ధాపూర్ నుంచి సోమవారం ఉదయం 8 గంటలకు ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు. పాదయాత్రకు పార్టీలకతీతంగా పరిసర గ్రామాల ప్రజలు, యువకులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్యార్డు ఏర్పాటు చేయొద్దన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ, జీవోల ఉపసంహరణ వచ్చే వరకు ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. స్థానిక ప్రజల అభివృద్ధి, ప్రాణాలకు డంప్యార్డు ప్రాణసంకటంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జేఏసీకి టీఆర్ఎస్ మద్దతు
డంప్యార్డు ఏర్పాటును అడ్డుకోవడానికి జేఏసీతో కలిసి పోరాటం చేయడానికి షాద్నగర్ టీఆర్ఎస్ ఇన్చార్జి సీమల రమేశ్ కురుమ మద్దతు ఇచ్చినట్లు జేఏసీ అధ్యక్షుడు అంబటి ప్రభాకర్ తెలిపారు. డంప్యార్డు ఏర్పాటైతే స్థానికులతో పాటు సమీపంలో ఉన్న పదుల సంఖ్యలో గ్రామాలు అన్ని విధాలుగా నష్టపోతాయని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి తాము చేస్తున్న పోరాటాలు, ఉద్యమాలకు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు, యువజన సంఘాలు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.


