మోమిన్పేట: సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్షతో పాటు రూ.500ల జరిమానా విధించారు. మంగళవారం ఎస్ఐ భరత్ భూషన్ తెలిపిన ప్రకారం.. మర్పల్లి మండలం సరిపురం గ్రామానికి చెందిన మధూకర్రెడ్డి తన స్నేహితులతో కలిసి మార్చి 28వ తేదీన మోమిన్పేటలోని ఏఎన్ఆర్ దాబాలో మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఆయన స్నేహితులతో గొడవపడ్డాడు. అనంతరం ఇద్దరు న్యాయం చేయాలంటూ ఠాణాకు వచ్చారు. ఈ క్రమంలో మధూకర్రెడ్డి సమీపంలోని సెల్ టవర్ ఎక్కి మద్యం సేవిస్తూ ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో కేసు నమోదు చేసి మంగళవారం కోర్టు ఎదుట హాజరు పరిచారు. కేసు పరిశీలించిన స్పెషల్ జ్యుడీషియల్ రెండవ తరగతి న్యాయమూర్తి మాయ బ్రహ్మనర్సింహ ఏడు రోజుల జైలు శిక్షతో పాటు రూ.500ల జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు.


