పరిగి: విద్యుదాఘాతానికి గురైన ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మున్సిపల్ పరిధిలోని రుక్కుంపల్లి గేట్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ మోహనకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండలం బడెంపల్లితండాకు చెందిన మూడవత్ సురేశ్(28) కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి పనికి వెళ్తానని చెప్పి బయలు దేరిన కుమారుడు విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి అతడి తల్లిదండ్రుల రోదనల మిన్నంటాయి. వికారాబాద్లో లేబర్ పని ఉందని వెళ్లే క్రమంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు మొక్కజొన్న పంటలోని వెళ్లగా.. పందుల బెడద నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


