
ఉద్యోగ జాతర
మెగా జాబ్మేళాకు వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు
● 63 కంపెనీల ప్రతినిధుల హాజరు ● ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 4,200 మంది ● అర్హత సాధించిన వారు 4వేల మంది ● కార్యక్రమం విజయవంతం కావడంతో ఎమ్మెల్యే బీఎంఆర్ హర్షం
తాండూరు: ఉద్యోగ.. ఉపాధి అవకాశాలు లేని నియోజకవర్గ యువతకు గురువారం నాటి మెగా జాబ్మేళా సరికొత్త ఆశలు రేకెత్తించింది. ఈ ప్రాంతానికి చెందిన యువకులు ఉద్యోగాలు లేక ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. తాండూరు నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉండటంతో ఉద్యోగ అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ ప్రాంతంలో అధికంగా నాపరాతి పరిశ్రమలు, గనులు ఉన్నాయి. వీటిని పని చేయడమంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. దీంతో యువకులు అయిష్టత చూపుతున్నారు. చాలా కాలంగా పీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టాలని భావించిన ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ప్రభుత్వ రంగ సంస్థ ఈజీఎంఎం సౌజన్యంతో గురువారం తాండూరు పట్టణంలో మెగా ఉద్యోగమేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని యాలాల, పెద్దేముల్, కోట్పల్లి, బషీరాబాద్, తాండూరు మండలాల తోపాటు, తాండూరు మున్సిపాలిటీ నుంచి వేల సంఖ్యలో నిరుద్యోగులు వచ్చారు. వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 63 కంపెనీలు 11వేల ఉద్యోగాల భర్తీ కోసం అర్జీలు స్వీకరించాయి. అభ్యర్థులతో పట్టణంలోని వినాయక కన్వెన్షన్ ప్రాంగణం జనసంద్రంగా మారింది. తల్లిదండ్రులు తమ పిల్లలను వెంటబెట్టుకొచ్చారు. దాదాపు 8 నుంచి 9వేల మంది వరకు నిరుద్యోగులు హాజరయ్యారు. వీరిలో 4వేల మంది ఉద్యోగాలకు అర్హత సాఽధించారు. దరఖాస్తు ఫారాలు నింపేందుకు అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి సాయం చేశారు. అభ్యర్థుల కోసం హెల్ప్ లైన్ సెంటర్, వైద్య సేవలను అందుబాటులో ఉంచారు. అర్హత పొందిన వారికి నియామక పత్రాలు అందించారు.
ఉద్యోగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే
మెగా జాబ్మేళాలో ఉద్యోగాలు సాఽధించిన వారు ఆ రంగంలో రాణించాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి సూచించారు. గురువారం తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో ఈజీఎంఎం సౌజన్యంతో జాబ్మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగులకు నాలుగు వేల ఉద్యోగాలు రావడం తాండూరు చరిత్రలోనే ఇదే తొలిసారి అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య శాఖ అధికారులకు ధాన్యవాదాలు తెలిపారు. అనంతరం ఉద్యోగాలు సాఽధించిన వారికి నియామక పత్రాలను అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యుడు రమేష్ మహరాజ్, వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత, ఎస్పీ నారాయణరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్, డీఆర్డీఓ కృష్ణన్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ రవిగౌడ్, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు పట్లోళ్ల బాల్రెడ్డి, మాధవరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి థారాసింగ్, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్లాల, నాయకులు పట్లోళ్ల నర్సింహులు, ఉత్తమ్చంద్ తదితరులు పాల్గొన్నారు.
సంతోషంగా ఉంది
మెగా జాబ్మేళాలో ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. కొంత కాలంగా జాబ్ కోసం ఎవరిని సంప్రదించాలనే విషయం తెలియక ఇబ్బంది పడ్డా. ఇలాంటి సమయంలో జాబ్మేళా ఏర్పాటు చేసినట్లు తెలిసి ఇక్కడికి వచ్చా. తనకు నచ్చిన కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే మనోహర్రెడ్డికి రుణపడి ఉంటా.
– గిరిజ, తాండూరు
నెలకు రూ.20 వేల వేతనం
జాబామేళాలో దరఖాస్తు చేసుకున్న గంట వ్యవధిలోనే ఉద్యోగం లభించింది. ప్రతి నెలా రూ.20 వేల వేతనం. నియామక పత్రం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. కుటుంబంపై ఆర్థిక భారం తగ్గుతుంది. మాలాంటి వాళ్లకు ఉద్యోగమేళా ఎంతో మేలు చేసింది. నిర్వాహకుల సేవను మరచిపోలేం.
– సుప్రియ, కరన్కోట్, తాండూరు మండలం

ఉద్యోగ జాతర

ఉద్యోగ జాతర

ఉద్యోగ జాతర