
ఫోర్ లేన్కు గ్రహణం వీడేనా?
ధారూరు: తాండూరు–వికారాబాద్ వయా ధారూ రు ఫోర్ లేన్ రహదారి నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యాయని అధికారులు చెబుతున్నా పనులు మాత్రం ప్రారంభం కావడంలేదు. ఈ పనులు పూర్తయితే ధారూరు మండల కేంద్రంలోని 16వ కిలో మీటర్ నుంచి 17.5 కిలో మీటర్ పీఎస్ వరకు రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటవుతుంది. 20 మీటర్ల వెడల్పుతో రోడ్డును విస్తరించడానికి గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. కానీ పనులకు మాత్రం మోక్షం లభించలేదు. దీంతో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు ఏళ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇందుకోసం 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. కోటి మంజూరు చేసింది. రోడ్డు వేసిన అధికారులు సెంట్రల్ లైటింగ్ సిస్టంకు మంగళం పాడారు. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా నిధులు లేని కారణంగా పనులు చేపట్టలేదని పేర్కొన్నారు. దీంతో మంజూరైన నిధులు ఏమయ్యాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వమైనా సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.