
వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
అనంతగిరి: జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని, ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ వేడుకలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వరాదని సూచించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. పట్టణంలోని అమర వీరుల స్తూపాన్ని, సభాస్థలి వేదికను పూలతో అందంగా అలంకరించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, నూతన రేషన్ కార్డులు, స్వయం సహాయక సంఘాలకు చెక్కుల పంపిణీ, గ్రామ పంచాయతీ అధికారులకు నియామక పత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందో బస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని డీఈఓ రేణుకాదేవికి సూచించారు. స్పీకర్ ప్రసాద్కుమార్ చేతులమీదుగా పతాకావిష్కరణ చేపట్టనున్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అదనపు ఎస్పీ టి.వి.హనుమంత్ రావు, ఆర్డీఓ వాసుచంద్ర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్జైన్
రాష్ట్ర అవతరణ వేడుకలపై అధికారులకు దిశానిర్ద్ధేశం