
‘భూ భారతి’పై అవగాహన అవసరం
తాండూరు రూరల్: భూ భారతి చట్టంపై ప్రతీ రైతుకు అవగాహన అవసరమని తాండూరు సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన ఎల్మకన్నె గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. భూ సమస్యలున్న రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రికార్డుల్లో తప్పులుంటే సరిచేసుకోవాలని సూచించారు. భూ మార్పిడిలో సర్వేయర్ రూపొందించిన నక్షను జత చేసినట్లయితే భవిష్యత్లోనూ భూ వివాదాలకు తావుండదని వివరించారు. చంద్రవంచలో డిప్యూటీ తహసీల్దార్ లలిత ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఎల్మకన్నెలో 11 దరఖాస్తులు, చంద్రవంచలో నాలుగు దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ తారాసింగ్ తెలిపారు. మ్యుటేషన్, విరాసత్, పాసు పుస్తకంలో రైతు పేర్ల తప్పులు, భూ విస్తీర్ణంలో సవరణపై ఫిర్యాదులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ గోపి, సిబ్బంది బాబు, నర్సింలు, అంజమ్మ, ప్రవీణ్, యాదయ్య, ఇంతియాజ్, ప్రదీప్, నరేశ్, ఉలేందర్, గోపాల్, మహేందర్, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
తాండూరు సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్