
ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుద్దాం
అనంతగిరి: వికారాబాద్ను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుద్దామని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కాలుష్యం అంతం చేద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం పెరిగి చివరకు మనం తీసుకునే ఆహారంలో కూడా చేరుతోందని తెలిపారు. ఇది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాలన్నారు. అనంతరం అనంతగిరి అర్బన్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్, అటవీ రేంజ్ ఆఫీసర్లు శ్యామ్ కుమార్, రాజేందర్, ప్రతిమ, అటవీ సెక్షన్ అధికారి అరుణ, ఉద్యాన్ కేర్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, విద్యార్థినులు, సత్యసాయి సేవా ట్రస్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన
జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గల ఈవీఎం గోదామ్ను గురువారం కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాం సీల్ను ఓపెన్ చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత రికార్డులను పరిశీలించి సంతకాలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెమత్ హాలీ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు
బంట్వారం: భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం కోట్పల్లి మండలం రాంపూర్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును ఆయన సందర్శించారు. భూ సమస్యలపై రైతులు ఇచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని తహసీల్దార్ శ్రీనివాస్కు సూచించారు. అనంతరం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. స్థానికుల సహకారంతో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పిల్లలందరూ బడిలోనే ఉండేలా చూడాలన్నారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రేషన్ షాపుల్లో మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం పంపిణీపై ఆరా తీశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్
అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం