
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
తాండూరు టౌన్: మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ స్పెషలాఫీర్, అదనపు కలెక్టర్ సుధీర్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహా రెడ్డి, ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని వార్డులకు మంజూరైన అభివృద్ధి పనులు, పురోగతి తదితరాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి, 15వ ఆర్థిక సంఘం, సాధారణ నిధుల కింద కొనసాగుతున్న పనులు, నిలిచిన పనులు, నిధుల విడుదల్లో జాప్యం తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. నాణ్యతతో కూడిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఉద్యోగుల వేతనాలు, పారిశుద్ధ్యం, టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ తదితర విభాగాల పనితీరుపై సమీక్షించామన్నారు. అనంతరం బసవన్న కట్ట వద్ద జంతు వ్యర్థాలను వేస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. జనావాసాల నడుమ వ్యర్థాలు వేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను, చిలుకవాగు కాల్వ నిర్మాణ పనులను పరిశీలించారు.
కూల్చివేతలకు సహకరించాలి
పట్టణ ప్రధాన రోడ్డు పనుల విస్తీర్ణానికి ప్రజలు, చిరు వ్యాపారులు సహకరించాలన్నారు. అక్రమ కట్టడాలు నిర్మిస్తే నోటీసులు జారీ చేసి తొలగిస్తామన్నారు. పట్టణంలో ఏర్పడే ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే అక్రమ కట్టడాలను తొలగించక తప్పదన్నారు.
వంద రోజుల ప్రణాళిక
జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మున్సిపల్ ఆధ్వర్యంలో కొనసాగనున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళికకు ప్రజలు సహకరించాలన్నారు. మెప్మా, మున్సిపల్ సిబ్బందితో కలిసి వార్డుల్లో ర్యాలీ నిర్వహిస్తూ, తడి, పొడి చెత్త, పరిసరాల శుభ్రత, తాగునీటి వినియోగం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు.
వంద రోజుల ప్రణాళికతో సమస్యలు దూరం
మున్సిపల్ స్పెషలాఫీసర్, అదనపు కలెక్టర్ సుధీర్ కుమార్