
అన్నోజిగూడలో విషాదం
● రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడికి గాయాలు
● చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి
● అంత్యక్రియల్లో పాల్గొన్న
జిల్లా రాజకీయ ప్రముఖులు
కందుకూరు: కుమార్తెను లండన్ పంపించేందుకు ఏర్పాట్లు చేసుకున్న ఓ తండ్రి ఊహించని ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని అన్నోజిగూడకు చెందిన మాజీ ఉప సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెంకల యాదయ్య(54) శుక్రవారం ఉదయం బైక్పై హైదరాబాద్ వెళ్తుండగా పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం యశోద ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. కాగా మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. ఈనెల 9న కూతురును ఉన్నత చదువుల కోసం లండన్లో పంపించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం సన్నిహితులు, బంధువులకు విందు ఏర్పాటు చేశాడు. కానీ ఊహించని ప్రమాదంలో గాయపడి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు బొక్క జంగారెడ్డి, ఏనుగు జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఎస్.మల్లేశ్, వివిధ పార్టీల నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు హాజరై నివాళులర్పించారు.