
రోడ్లపైనే నిరీక్షణ!
దుద్యాల్: మండల పరిధిలోని పలు గ్రామాల్లో బస్టాండ్లు లేక ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబుబ్నగర్– చించోలి జాతీయ రహదారిపై దుద్యాల్ మండల కేంద్ర ప్రధాన గేట్తో పాటు మండలంలోని హస్నాబాద్, లగచర్ల గేట్, ఈర్లపల్లి, గౌరారం, చిలుముల మైల్వార్ తదితర గ్రామాల్లో బస్ షెల్టర్లు అందుబాటులో లేవు.
రద్దీగా ఉండే ప్రాంతాల్లో..
దుద్యాల్ గేట్, హస్నాబాద్ తదితర గ్రామాల మీదుగా మహబుబ్నగర్– తాండూరు రూట్లలో బస్సులు ఎక్కువగా తిరుగుతుంటాయి. లగచర్ల గేట్ నుంచి హైదారాబాద్కు అధిక సంఖ్యలో జనాలు రాకపోకలు సాగిస్తారు. ఈ నేపథ్యంలో నిత్యం వందలాది మంది బస్సుల కోసం వేచి చూస్తుంటారు. వీరికి కనీసం నిలబడేందుకు కూడా చోటు లేకపోవడంతో రోడ్లపై నిలబడి బస్సుల కోసం పడిగాపులు కాస్తుంటారు. ప్రస్తుత వర్షాకాలంలో చినుకులు పడితే ఎక్కడా ఉండలేని పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి అవసరమైన చోట బస్ షెల్టర్లు నిర్మించాలని కోరుతున్నారు.
కనీస సౌకర్యాలు కరువు
బస్సుల కోసం వేచి చూసే సమయంలో తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక జనం ఇక్కట్లకు గురవుతున్నారు. తాము వెళ్లే బస్సులు వచ్చే వరకు సమీపంలోని హోటళ్లను, ఆశ్రహిస్తున్నారు. బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు కూర్చోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు స్పందించి అవసరమైన ప్రారంతాల్లో బస్ షెల్టర్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అందుబాటులోలేని బస్ షెల్టర్లు
ఎండావానలో ప్రజలు, ప్రయాణికుల అవస్థలు
పట్టించుకోని ఆర్టీసీ అధికారులు
షెల్టర్లు ఏర్పాటు చేయాలి
ప్రతి రోజు ప్రయాణికులు తాము వెళ్లే బస్సు వచ్చే వరకు నిరీక్షస్తుంటారు. కూర్చోడానికి స్థలం లేక రోడ్డుపైన నిలబడుతున్నారు. ఆర్టీసీ అధికారులు చొరవ చూపి రద్దీగా ఉండే ప్రాంతాల్లో బస్ షెల్టర్ను ఏర్పాటు చేయాలి.
– సురేశ్, ప్రయాణికుడు, దుద్యాల్

రోడ్లపైనే నిరీక్షణ!

రోడ్లపైనే నిరీక్షణ!