
బెర్త్ దక్కేనా..?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: తెలంగాణలోనే కీలకమైన జిల్లా నేతలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఒక్కరికీ అవకాశం దక్కలేదు. ప్రభుత్వానికి ఆర్థిక, రాజకీయ వనరులను సమకూర్చిపెట్టే కీలకమైన ఆయా జిల్లాల నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ ఉండనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జిల్లా నేతలకు ఈసారైనా అవకాశం దక్కేనా అనేది వేచిచూడాలి.
సీనియార్టీనా.. సామాజిక సమీకరణాలా?
గ్రేటర్కు ఆనుకుని ఉన్న జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటిలో ఇబ్రహీంపట్నం, షాద్నగర్, కల్వకుర్తి స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనుభవం ఉండగా, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవం ఉంది. షాద్నగర్ నుంచి వీర్లపల్లి తొలిసారిగా గెలుపొందారు. ఆయన బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చారు. కారుగుర్తుపై గెలుపొందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మంత్రి పదవులు, అభివృద్ధి కోసం భారీ నిధుల పేరుతో హస్తం గూటికి చేరుకున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పదవులు దక్కే అవకాశం లేదు. మొదటి నుంచీ పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ..వారికి మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడంపై కేడర్లో నిస్తేజం నెలకొంది. డీసీసీ వేదికగా జరిగిన పలు సమావేశాల్లోనూ ఇదే అంశంపై నేతలు బహిరంగ విమర్శలకు దిగడం గమనార్హం. కొంత మంది సీనియర్ నేతలు ఏకంగా ఢిల్లీకి చేరుకుని పార్టీ అధిష్టానాన్ని కలిసి విన్నవించడం తెలిసిందే. పార్టీలో ఎక్కువ పదవులు ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణలోనే కాదు కార్పొరేషన్, ఇతర పదువుల్లోనూ సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకోవాలని అధిష్టానం సూచించినట్లు తెలిసింది. సీనియార్టీకి ప్రాధాన్యత ఇస్తే మల్రెడ్డికి చాన్స్ ఉంటుంది. బీసీ నినాదాన్ని ఎత్తుకుంటే వీర్లపల్లికి అవకాశం ఉంది. ఇక ఎస్సీ కోటాకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే ఇప్పటికే శాసనసభ స్పీకర్గా కొనసాగుతున్న గడ్డం ప్రసాద్కుమార్కు చాన్స్ కల్పించనుంది.
సమన్వయం చేసే వారు లేక ..
ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి పెట్టడంలోనే కాదు పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనలో ముందు వరుసలో నిలిచే జిల్లాకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడం ఇబ్బందిగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలే కాదు చివరికి అధికారులు సైతం ప్రతి చిన్న పనికి ఇన్చార్జి మంత్రిని ఆశ్రయించాల్సి వస్తోంది. ఫ్యూచర్సిటీ కోసం భూ సేకరణ, కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం, ఐటీ, అనుబంధ సంస్థలకు భూముల కేటాయింపు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధుల సేకరణ వంటి కీలక అంశాలపై జిల్లా నేతలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంది. అంతేకాదు ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని, సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి కారణమైన నేతలకు నామినేటెడ్ పదవులు ఇప్పించుకోవడం, వ్యక్తిగత, ఇతర సమస్యలతో వచ్చే వారికి సమయం ఇచ్చి, వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సి ఉంది. జిల్లాకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడంతో అభివృద్ధి సహా సంస్థాగతంగా కేడర్ను బలోపేతం చేసే దిశగా ఎలాంటి అడుగులు పడటం లేదు. ఇన్చార్జి మంత్రి ఉన్నప్పటికీ..ఆయనతో జిల్లా సెకండ్ కేడర్ నేతలకు పెద్దగా పరిచయాలు లేకపోవడం, అధ్యయనాల పేరుతో ఆయన తరచూ విదేశాల్లో పర్యటించాల్సి వస్తుండటం, కేవలం ముఖ్య నేతలు పాల్గొనే బహిరంగ సభలు, సమావేశాలకే పరిమితం అవుతుండటం జిల్లా నేతలకు ఇబ్బందిగా మారింది. జిల్లాస్థాయి సమీక్ష, సమావేశాలు కూడా నామమాత్రంగా నిర్వహించి వెళ్తుండటాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా విస్తరణ కథనాలతో బెర్త్ ఎవరికి దక్కుతుందన్న చర్చలు మొదలయ్యాయి.
మంత్రి వర్గంలో రంగారెడ్డి జిల్లాకు దక్కని ప్రాతినిధ్యం
విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో మళ్లీ కదలిక
ఎవరికి అవకాశం దక్కుతుందా అనే చర్చలు

బెర్త్ దక్కేనా..?