మరో లగచర్ల చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

మరో లగచర్ల చేయొద్దు

Jun 8 2025 7:20 AM | Updated on Jun 8 2025 7:20 AM

మరో లగచర్ల చేయొద్దు

మరో లగచర్ల చేయొద్దు

మొయినాబాద్‌: ఎనికేపల్లి భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మరో లగచర్లను చూస్తారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి హెచ్చరించారు. మున్సిపల్‌ పరిధిలోని ఎనికేపల్లిలో ప్రభుత్వం గోశాలకు కేటాయించిన భూములను శనివారం ఆమె సందర్శించారు. రైతులు సాగుచేసిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారికి మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18 నెలలుగా రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని వర్గాల వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. కొన్ని రోజులు మూసీ పరిసరాల్లో పేదలను గుంజేశారని.. ఫుట్‌పాత్‌పై ఉండే పేదలను లాగేస్తున్నారన్నారు. లగచర్లలో గిరిజనుల భూములు గుంజుకునే ప్రయత్నం చేశారని.. ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో కొత్త రోడ్డుకోసం 3వేల ఎకరాలు పేదల భూములు తీసుకుంటున్నారని విమర్శించారు. సంగారెడ్డి, గద్వాలలో పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాజాగా ఎనికేపల్లిలో గోశాల ఏర్పాటుకోసం అంటూ వంద ఎకరాలను రైతుల నుంచి లాక్కుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా పేదలు, చిన్న, సన్నకారు రైతుల భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఎనికేపల్లి విషయం తెలిసి కేసీఆర్‌ తనను ఇక్కడి పంపారన్నారు. రైతుల భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని.. వారికి మద్దతుగా పోరాడతామని స్పష్టం చేశారు.

1954 నుంచి రైతులే సాగు చేస్తున్నారు

ఎనికేపల్లిలో 1954లోనే హరిజనులు సాగుచేసుకుంటున్నట్లు రికార్డులో ఉందని.. 1998 వరకు రైతులు శిస్తు కట్టిన రసీదులు ఉన్నాయన్నారు. ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం భూములను ఎలా తీసుకుంటుందని నిలదీశారు. వాళ్ల భూములు వారికే పట్టా చేసి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాలపై చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళతో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

కోకాపేట భూములను అమ్ముకోవడానికే..

కోకాపేటలో గోశాలకు 200 ఎకరాల భూమి ఉందని.. అందులో 100 ఎకరాలు ప్రభుత్వం తీసుకుని దానికి బదులు ఎనికేపల్లిలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. గోశాలకు ఇవ్వాలంటే మొయినాబాద్‌ మండలంలోనే ప్రభుత్వం పీఓటీ చట్టంకింద స్వాధీనం చేసుకున్న వెయ్యి ఎకరాల భూమి ఉందని గుర్తు చేశారు. ప్రతి ఫాంహౌస్‌, ప్రతి కాలేజీలో ప్రభుత్వ భూమి ఉందని.. వాటిని బయటకు తీయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, దేశమొల్ల ఆంజనేయులు, పార్టీ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు కోట్ల నరోత్తంరెడ్డి, శ్రీహరియాదవ్‌, సుధాకర్‌యాదవ్‌, రాఘవరెడ్డి, మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు కొత్త మాణిక్‌రెడ్డి, మోర శ్రీనివాస్‌, రవీందర్‌, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోం

అన్నదాతలకు అన్యాయం జరగనివ్వం

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement