
పంటకు గంగరాయి
నీళ్లపల్లిలో 500 ఎకరాల్లో విస్తరించిన రాళ్లభూమి
● ప్రతికూల వాతావరణంలోనూ దిగుబడి ● పత్తి, జొన్న, శనగ పంటలకు ఎంతో మేలు ● యంత్రాలతోనే సాగు చేయాలంటున్న రైతులు
బషీరాబాద్: సాధారణంగా పొలాల్లో రాళ్లు ఉంటే పంటలు సరిగ్గా పండవు.. వాటిని తొలగించేందుకు రైతులు ఎంతైనా ఖర్చు చేస్తుంటారు.. కానీ బషీరాబాద్ మండలం నీళ్లపల్లిలో ఆ రాళ్లే పసిడి పంటకు దోహదం చేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వందల ఎకరాల్లో పలుగురాళ్లు (గంగారాయి) రాశులు పోసినట్లు కనిపిస్తాయి. అవి పొలంలో తడి ఆరకుండా పంట ఎదుగుదలకు దోహసం చేస్తున్నాయి. రబీ సీజన్లో జొన్న, శనగ, తెల్ల కుసుమ పంటలకు ఈ రాళ్లు జీవం పోస్తున్నాయి. విత్తు మొదలు పంట కోసే వరకు భూమిలో తేమశాతం తగ్గకుండా కాపాడుతున్నాయి.
ఏడాదికి రెండు పంటలు
బషీరాబాద్ మండలంలోని నీళ్లపల్లి, జలాల్పూర్ తోపాటు కొండగల్ నియోజకవర్గంలోని రుద్రారం, టేకుల్కోడ్ గ్రామాల పరిధిలో సుమారు 500 ఎకరాల్లో ఈ రాళ్ల పొలాలు ఉన్నాయి. ఈ రాళ్లను రైతులు గంగ రాయి, చలువరాయి అని పిలుస్తారు. ఈ భూముల్లో ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నారు. ఖరీఫ్లో పత్తి, కంది ఎక్కువగా సాగు చేస్తారు. పత్తి మంచి దిగుబడి వస్తుందని.. కంది సాగుకు అంతగా అనుకూలించవని రైతులు చెబుతున్నారు.
యంత్రాలతోనే సాగు
పొలమంతా గంగరాళ్లు ఉండటంతో ఎద్దులతో వ్యవసాయం చేయడం చాలా కష్టం. కూలీలు కూడా పనిచేయలేని పరిస్థితి. రాళ్ల కారణంగా పొలాల్లో నడవలేరు. దీంతో రైతులు ప్రత్యామ్నాయంగా యంత్రాలను వినియోగిస్తున్నారు. విత్తు మొదలు పంట కోతలు, నూర్పిడి వరకు యంత్రాలనే వాడుతున్నారు. కేవలం పత్తి తీసేందుకు మాత్రం కూలీలను వినియోగిస్తున్నారు.
అధిక దిగుబడికి దోహదం
గంగరాయి పొలాలు పత్తి, జొన్న, శనగ పంటలకు అనుకూలం. సాధారణ పొలాల కంటే వీటిలో అధిక దిగుబడి వస్తుంది. ముఖ్యంగా రబీ సీజన్లో తేమ శాతం తగ్గదు. దీంతో పంటలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
నేల వేడెక్కదు
సూర్య కిరణాలు పలుగు రాళ్లపై పడటం ద్వారా పొలం వేడెక్కదు. ఈ రాళ్లు 60శాతం మేర ఎండను అడ్డుకుంటాయి. తద్వారా భూమిలో తేమ ఆరదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా పంటలకు ఎలాంటి నష్టం జరగదు. పొలం లోపల పైన రాళ్లు ఉండటంతో పంటకు చలువ లభించి మొక్కలు ఏపుగా పెరుగుతాయి. దీంతో అధిక దిగుబడి వస్తుంది.
– సుధాకర్, వ్యవసాయ శాస్త్రవేత్త, తాండూరు
రాళ్లే పంటకు జీవం
మా కుటుంబానికి 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పొలం నిండా రాళ్లు రాశులు పోసినట్లు ఉంటాయి. ఆ రాళ్లే సిరులు కురుపిస్తున్నాయి. భూమి లో తడి ఆరకుండా మేలు చేస్తాయి. పత్తి, కంది, జొన్న, శనగ సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది. ఎకరాకు 13 క్వింటాళ్ల పత్తి వస్తుంది. జొన్నలు అయితే 14 క్వింటాళ్లు వస్తాయి.
– రుక్మారెడ్డి, రైతు నీళ్లపల్లి