
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
నవాబుపేట: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతుల మేలే ధ్యేయంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో అన్నదాతలకు సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం నవాబుపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని అన్నారు. సబ్సిడీపై విత్తనాలు, వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. అర్హురులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతామన్నారు. మొదటి విడతలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తే బిల్లులు చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రామ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, ఎంపీడీవో అనురాధ, మండల వ్యవసాయ అధికారి జ్యోతి, ఇన్చార్జ్ తహసీల్దార్ శ్రీలత, ఎంపీఓ విజయ్కుమార్, ఏఈవోలు, మండల నాయకులు ప్రభాకర్, నరసింహారెడ్డి, రాజశేఖర్రెడ్డి, ఖదీర్, అనంతరామ్ పాల్గొన్నారు.
సకాలంలో పూర్తి చేసుకుంటే బిల్లులు మంజూరు చేస్తాం
ఎమ్మెల్యే కాలె యాదయ్య