
నేత్రపర్వం.. రథోత్సవం
● వైభవంగా రేణుక ఎల్లమ్మ జాతర
● అమ్మవారి సేవలో ప్రముఖులు
తాండూరు రూరల్: మండలంలోని కొత్లాపూర్లో కొలువు దీరిన రేణుక ఎల్లమ్మ జాతర నెల రోజులగా వైభవంగా సాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవం, సిడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ చైర్మన్ నవీన్రెడ్డి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయానికి తెచ్చారు. సిడేను పూలతో అందంగా అలంకరించారు. రథోత్సవం, సిడే ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కర్ణాటక మాజీ మంత్రి అరవింద్ లింబావళి, ఫైనాన్స్ కమిటీ సభ్యుడు రమేష్ మహరాజ్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి వేడుకల్లో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్ఐ విఠల్రెడ్డి, ఏఎస్ఐలు రాజశేఖర్, పవన్కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకల్లో ఆలయ ఈవో శేఖర్ గౌడ్, మాజీ చైర్మన్ సందీప్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేత్రపర్వం.. రథోత్సవం