డక్కిలి: ప్రజలకు అన్యాయం చేస్తే సహించే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని వెంబలూరులో పూల కృష్ణయ్య, పూల వెంకటేశ్వర్లుకు చెందిన పట్టా భూమిలో నిమ్మచెట్లను అక్రమంగా అధికారులు తొలగించడంపై ఆయన మండిపడ్డారు. ఆదివారం ఈ మేరకు గ్రామానికి వెళ్లి బాధిత రైతులను పరామర్శించారు. బాధితులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తాము కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న భూమిలో దౌర్జన్యంగా నిమ్మ చెట్లు తొలగించి దారి వేసేందుకు తహసీల్దార్, పోలీసులు చర్యలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారం నుంచి నిద్ర లేకుండా తమ పొలం వద్ద కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. స్పందించిన నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మాట్లాడుతూ రాత్రి వేళ జేసీబీలు తీసుకువచ్చి అధికారులు దౌర్జన్యానికి పాల్పడ్డారంటేనే వారు తప్పు చేస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతర్ చేసి అక్రమంగా వ్యహరిస్తున్న అధికారులపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని, తప్పు చేసిన అధికారులను ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. పార్టీ మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులురెడ్డి, బాలాయపల్లె మండల కన్వీనర్ వెందోటి కార్తీక్రెడ్డి, మాధవయ్యపాళెం సొసైటీ మాజీ అధ్యక్షుడు నర్రావుల వేణు గోపాల్ నాయుడు, నేతలు కసుమూరు మధురెడ్డి, ఎంఎల్ నారాయణరెడ్డి, పాయసం పోలయ్య, శ్రీహరిరెడ్డి, గుండోలు మధు పాల్గొన్నారు.


