తిరుపతి అన్నమయ్యసర్కిల్: గ్రేటర్ రాయలసీమ టాస్క్ఫోర్స్ చైర్మన్, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డితో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడితో రద్దు చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు సర్కారు ఉందన్నారు. తెలంగాణ కృష్ణా జలాల్లో అదనపు వాటా కోసం కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నా, కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు కోసం టెండర్లు పిలిచినా కూడా ఏపీ ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో రాష్ట్ర నీటి హక్కులు ప్రమాదంలో పడుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పట్లో దూరదృష్టితో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారన్నారు. రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉందని, 80 శాతం పూర్తయిన ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకు ఏపీ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. ఇలాంటి సమయంలో వైఎస్సార్ సీపీ విస్తృత ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటంలో రాయలసీమ ప్రజలు, మేధావులు భాగస్వామ్యం కావాలని మాజీ మంత్రి శైలజానాథ్ విజ్ఞప్తి చేశారు.


