రేణిగుంట: రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటన అనంతరం శనివారం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు పయనమైన సీఎం చంద్రబాబు నాయుడికి సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, పెందుర్తి వెంకటేష్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈఓ ముద్దాడ రవీంద్ర, డీఐజీ షిమోజి బాయ్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, మున్సిపల్ కమిషనర్ మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, భాను ప్రకాష్, నెలవల విజయశ్రీ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు సాదరంగా వీడ్కోలు పలికారు. ముందుగా విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
చంద్రగిరిలో చిరుత కలకలం?
చంద్రగిరి: మండలంలో చిరుత పులి కనిపించడంతో కలకలం రేగింది. మండలంలోని ఎం.కొంగరవారిపల్లి, నడింపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత గాండ్రింపులు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. శనివారం ఎం.కొంగరవారిపల్లి జగనన్న కాలనీ సమీపంలో ఉపాధి కూలీలు పనులు నిమిత్తం వెళ్లారు. పని పూర్తి చేసుకున్న తర్వాత ఉపాధి సిబ్బంది పనులను ఫొటోలు తీస్తున్న క్రమంలో చిరుత పులి గాండ్రించిన శబ్ధం వారికి వినిపించింది. అలాగే పనులు చేస్తున్న సమీపంలో చిరుతపులి పాద ముద్రలను సైతం సిబ్బంది గుర్తించారు. బోలిగుండు నారవ వద్ద చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా తరచూ చిరుత గాండ్రింపులు వినిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిరుత పులి సంచారంపై అటవీ అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు.
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల: జేఎంసీ ట్రస్టు చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు శనివారం రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులును ముఖ్యమంత్రి అభినందించారు.


