పెళ్లకూరు: నిబంధనలకు విరుద్ధంగా స్వర్ణముఖినదిలో ఇసుక దోపిడీని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిది చిందేపల్లి మధుసూదన్రెడ్డి శనివారం అడ్డుకుని రెవెన్యూ, మైనింగ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కలవకూరు గ్రామం వద్ద స్వర్ణముఖినదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్న ప్రదేశానికి ఆయన చేరుకుని, అక్కడ ఇసుక దోపిడీపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్వర్ణముఖినదిలో ఇసుక మాఫియా రోజురోజుకు పేట్రేగిపోతుదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కలవకూరు గ్రామం వద్ద స్వర్ణముఖినదిలో ఇచ్చిన డీసిల్టింగ్ అనుమతులు మాటున యంత్రాలతో 20 అడుగులు పైగా ఇసుక తవ్వకాలు చేపట్టడంతో తాగు, సాగునీటికి కష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణముఖినదిలోని పైపొరను రోజు వారీ కూలీలతో తవ్వకాలు జరిపి అవసరాల నిమిత్తం తీసుకెళ్లేందుకు జిల్లా అధికారులు అనుమతులు ఇచ్చారన్నారు. ఆ అనుమతులు ఇక్కడ కాంట్రాక్టర్ భేఖాతరు చేస్తూ అధికార పార్టీ నేతలతో కలిసి భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. కూటమి నేతల చేస్తున్న ఇసుక దోపిడిని అడ్డకున్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిలతో పాటు జెడ్పీటీసీ సభ్యురాలు ప్రిస్కిల్లా, ఎంపీపీ శేఖర్రెడ్డిలతో పాటు 26మంది రైతులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం మంచిదికాదన్నారు. ఇసుక తవ్వకాల విషయమై డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇసుక తవ్వకాలు జరుపుతున్న యంత్రాలను రెవెన్యూ సిబ్బందికి అప్పగించి, స్థానిక తహసీల్ధార్ హరికృష్ణకు, వీఆర్వో వంశీకృష్ణకి ఫిర్యాదు చేసినప్పటికి స్పందించకపోవడంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఆనంద్, కౌషిక్రెడ్డి, కార్తిక్రెడ్డి, సునీల్, మహేష్లు ఉన్నారు.


